ప్రభుత్వం అనుమతించకపోయినా సెప్టెంబర్ 7వ తేదీన తలపెట్టిన ఛలో హైదరాబాద్ను నిర్వహించి తీరుతామని ఏపీఎన్జీవోల సంఘం స్పష్టం చేసింది.
హైదరాబాద్ : ప్రభుత్వం అనుమతించకపోయినా సెప్టెంబర్ 7వ తేదీన తలపెట్టిన ఛలో హైదరాబాద్ను నిర్వహించి తీరుతామని ఏపీఎన్జీవోల సంఘం స్పష్టం చేసింది. తాము శాంతియుతంగా నిరసన తెలియచేస్తామని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. అవసరం అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల నేతలను కలవాలని నిర్ణయించారు. వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన 40 మంది ప్రతినిధులతో ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు అశోక్బాబు తెలిపారు. సమైక్య వాదాన్ని ఢిల్లీ నేతలకు గట్టిగా వినిపిస్తామని చెప్పారు. ఆంటోనీ కమిటీని కలిసి తమ వాదనలు వినిపిస్తామని అశోక్ బాబు వెల్లడించారు.