ఫలించిన అమ్మ కష్టం | Anusha elected constable form poor family | Sakshi
Sakshi News home page

ఫలించిన అమ్మ కష్టం

Jan 6 2014 12:31 AM | Updated on Sep 5 2018 3:33 PM

కోటేశ్వరమ్మ తల్లి అంజమ్మ 20 ఏళ్లుగా స్థానిక కోర్టు, తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయ ప్రాంగణాల్లో శనక్కాయలు అమ్ముతూ జీవనం సాగించేది.

 కాలం పెట్టే పరీక్షలను ఎదురొడ్డుతూ ఆ తల్లి నిత్యం శనక్కాయల బొచ్చ నెత్తిన మోస్తూ బతుకు బండిని నెట్టుకొస్తోంది. వివరాలివి.. నరసరావుపేట పట్టణంలోని పెదచెరువులో నివాసముంటున్న పల్లపు కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకున్న కోటేశ్వరమ్మ శనక్కాయలు అమ్ముతోంది. వారి ఇద్దరు కుమారులు ఆదిశేషు, గోపిలు మతిస్ధిమితం లేకుండా జన్మించారు. దీంతో ఆమెకు మరిన్ని కష్టాలు నెత్తినపడ్డాయి. కోటేశ్వరమ్మ తల్లి అంజమ్మ 20 ఏళ్లుగా స్థానిక కోర్టు, తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయ ప్రాంగణాల్లో శనక్కాయలు అమ్ముతూ జీవనం సాగించేది.

 ఆమె తదనంతరం అదే వృత్తిని కొనసాగిస్తున్న కోటేశ్వరమ్మ తనలాగా తన కుమార్తె, కొడుకులు కష్టాలు పాలు కాకుండా ఉండాలని భావించింది. కూడబెట్టిన డబ్బులతో కుమార్తె అనూషను ఎంబీఏ చదివించింది. తమ కోసం తల్లి పడుతున్న కష్టాలను దగ్గరగా చూసిన అనూష ఎలాగైనా ఉన్నతస్థాయి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలని భావించింది. దీంతో ఈ ఏడాది రెండుసార్లు కానిస్టేబుల్ సెలక్షన్స్‌కు వెళ్లింది. మొదటిసారి అపజయం ఎదురైనా రెండోసారి పట్టుదలతో విజయం సాధించింది. గత ఏడాది మే 19న కానిస్టేబుల్‌గా ఎన్నికైంది.

కుమార్తెకు ఉద్యోగం రావడంతో తాను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని కోటేశ్వరమ్మ భావిస్తోంది. తన కుటుంబాన్ని ఆదుకునేందుకు మతిస్ధిమిత్తం లేని ఇద్దరు కుమారులను చూసుకునేందుకు అనూష అండగా నిలుస్తుందని ఆశిస్తోంది. మహానేత ైవె ఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఎంబీఏ వరకు చదువుకున్నానని అనూష చెప్పింది. ఈ ఉద్యోగంతో సంతృప్తి పడకుండా రానున్న రోజుల్లో ఎస్‌ఐగా సెలక్ట్ అవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది. సమాజంలో మహిళలు పడుతున్న ఇబ్బందుల పరిష్కరించే దిశగా ముందుకె ళతానని చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement