పాప కోసం... | Another twist in tale: Gokul Chat blast survivor now faces custody battle | Sakshi
Sakshi News home page

పాప కోసం...

Jul 17 2014 1:09 PM | Updated on Sep 2 2017 10:26 AM

పాప కోసం...

పాప కోసం...

పదేళ్ల సానియా ఫాతిమా సాగా కోసం ఇప్పుడు న్యాయపోరాటం జరుగుతోంది.

'జడ్జిమెంట్' తెలుగు సినిమా చూశారా. 90 ప్రాంతంలో వచ్చిన ఈ సినిమాలో ఒక పాపం ఇద్దరు అమ్మలు కోర్టుకెక్కుతారు. తర్వాత ఏం జరిగిందనేది జడ్జిమెంట్ సినిమా కథ. అచ్చం ఇలాంటి పరిస్థితే హైదరాబాద్ లో ఒక పాపకు ఎదురైంది. పదేళ్ల సానియా ఫాతిమా సాగా కోసం ఇప్పుడు న్యాయపోరాటం జరుగుతోంది.

అసలేం జరిగిందో తెలియాలంటే ఏడేళ్లు వెనక్కు వెళ్లాలి. రాష్ట్ర ప్రజలను భయకంపితులను చేసిన 2007 వరుస బాంబు పేలుళ్ల ఘటన ఫాతిమా జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. అప్పటికి మూడున్నరేళ్లు ఉన్న ఫాతిమా తండ్రితో కలిసి వెళ్లి గోకుల్ ఛాట్ దగ్గర జరిగిన పేలుళ్లతో ఒంటరిగా మిగిలింది.

తండ్రి కనిపించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆమెను పాపాలాల్ రవికాంత్, జయశ్రీ అనే హిందు దంపతులు చేర దీశారు. ఆమె పేరుగా అంజలిగా మార్చి పెంచుకుంటున్నారు. అంజలి వచ్చిన తర్వాతే వారికి సంతానం కలగడంతో ఆమెను తమ అదృష్టదేవతగా చూసుకుంటున్నారు. ఏడేళ్లు గడిచిన తర్వాత అంజలి అసలు తండ్రినని చెప్పకుంటూ ఓ వ్యక్తి తెరపైకి రావడంతో కథ మరో మలుపు తిరిగింది.

ఫాతిమా తన బిడ్డ అంటూ అత్తాపూర్ కు చెందిన సయిద్ యూసఫ్ జూన్ 30న పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురిని అప్పగించాలంటూ మొరపెట్టుకున్నాడు. దిల్షుఖ్నగర్ పేలుళ్ల తర్వాత తన కుమార్తె ఫోటో టీవీలో చూసి గుర్తుపట్టానని చెప్పాడు. పేదరికం కారణంగానే ఇన్నాళ్లు తన కూతురి కోసం వెతక లేదని చెప్పాడు. యూసఫ్, ఫాతిమా తండ్రి కూతుళ్లు అవునో, కాదో తేల్చేందుకు పోలీసులు సిద్దమయ్యారు. వీరిద్దరికీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి కోరారు. 'జడ్జిమెంట్' ఎలా వుంటుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement