తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం అంగన్వాడీ కార్యకర్తలు, సీఎస్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్ సిబ్బంది చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది.
నెల్లూరు (వైద్యం): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం అంగన్వాడీ కార్యకర్తలు, సీఎస్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్ సిబ్బంది చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్దఎత్తున మహిళలు కలెక్టరేట్ ఎదుట బైటాయించారు. అధికారులు స్పందించకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు భీష్మించారు. పోలీసులు ఆందోళన కారులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఒక దశలో పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్షాన్ని సైతం మహిళలు లెక్క చెయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించారు. దాదాపు 5 గంటల పాటు ఆ ప్రాంతం ఉద్రిక్తత నెలకొంది. డీఆర్ఓ ఇచ్చిన హామీతో మహిళలు శాంతించారు.
ఓట్లు దండుకుని మహిళల కడుపు కొడతారా
- చంద్రబాబుపై పుణ్యవతి ఫైర్
ఎన్నికల్లో మహిళలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకున్న చంద్రబాబు ఇప్పుడు వారి కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు పుణ్యవతి మండిపడ్డారు. జపాన్, సింగపూర్ కాంట్రాక్టర్లపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని తీవ్రస్థాయిలో ఆమె విమర్శించారు. ఐకేపీ సిబ్బంది 90 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు.
బాబు వస్తే జాబు గ్యారెంటీ అని చెప్పి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టడం శోచనీయమన్నారు. సీఐటీయూ శ్రామిక మహిళ గౌరవాధ్యక్షురాలు షేక్ రెహనాబేగం మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు 2013లో పెంచిన రూ.800 వేతనాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముట్టడి కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, పోలుబోయిన అనిల్కుమార్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు స్వరూపారాణి, శేషమ్మ, షాహినాబేగం, అన్నపూర్ణమ్మ, విజయమ్మ, కొండమ్మ, బుజ్జమ్మ పాల్గొన్నారు.
సోమవారం జాయింట్ యాక్షన్ సమావేశం : సుదర్శన్రెడ్డి డీఆర్వో
అన్ని యూనియన్ల నాయకులతో సోమవారం జాయింట్ యాక్షన్ సమావేశం నిర్వహిస్తాం. తమ పరిధిలో ఉన్న పెన్షన్లు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు.