పనివేళల్లో ‘ఉపాధి’ విందు | Field assistant alcohol during working hours: Nandyal district | Sakshi
Sakshi News home page

పనివేళల్లో ‘ఉపాధి’ విందు

Jun 22 2025 5:49 AM | Updated on Jun 22 2025 1:49 PM

Field assistant alcohol during working hours: Nandyal district

విందులో పాల్గొన్న ఉపాధి ఉద్యోగులు

ఏర్పాటు చేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌  

అక్కడే మద్యం సేవిస్తూ ఉపాధి పనుల్లో అక్రమాలపై చర్చ  

నంద్యాల జిల్లా కల్వటాలలో ఘటన 

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

కొలిమిగుండ్ల: గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించాల్సిన ఉద్యోగులు పనివేళల్లోనే విందులో పాల్గొని..మద్యం సేవించి ఉపాధి పనుల్లో అక్రమాలను చర్చించుకుంటన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కల్వటాలలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా టీడీపీ కార్యకర్త పనిచేస్తున్నాడు. ఇతడు గ్రామానికి దూరంగా ఉన్న ఓ తోటలో విందు ఏర్పాటు చేశాడు.

ఇందులో టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, ఈసీ, కంప్యూటర్‌ ఆపరేటర్లతో పాటు బెలుం శింగవరానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విందులో మద్యం కూడా ఉంచారు. పనివేళల్లో ఉద్యోగులు మధ్యాహ్నం విందులో పాల్గొన్నారనే విషయం అధికారుల దృష్టికి వెళ్లినా వారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. విందులో మద్యం సేవించాక ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో పాటు పలువురు ఉద్యోగులు ఉపాధి పనుల్లో అక్రమాల గురించి బహిరంగంగా చర్చించుకున్నారు. అక్రమాలు అధికారుల దృష్టికి వెళితే ఎలా తప్పించుకోవాలో మాట్లాడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. 

యంత్రాలతో పనులు.. 
గ్రామ సమీపంలోని కొండలో చాలా రోజుల క్రితం రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీలో గ్రావెల్‌ను యంత్రాలతో తవ్వి తీసుకెళ్లారు. అవి గుంతలుగా ఏర్పడటంతో వాటిలో జేసీబీలతో చుట్టు కొలతలు వచ్చేలా చేసి ఉపాధి కూలీలతో పనులు చేయించినట్లు చిత్రీకరించారు. కొండలో చాలా చోట్ల ఇలాంటి పనులు చేశారు. జేసీబీలతో పనులు చేసి కూలీలు చేసినట్లుగా మస్టర్లలో హాజరు వేశారు.

ఈ బోగస్‌ పనులన్నీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కనుసన్నల్లోనే జరిగినట్లు సమాచారం. కూలీలతో పనులు చేయించినట్లు చూపించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై ఇటీవలే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమాలు బయటపడకుండా కప్పిపుచ్చుకునేందుకు ఉపాధి ఉద్యోగులకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ విందు ఏర్పాటు చేశారనే చర్చ నడుస్తోంది.

విచారణ చేస్తున్నాం 
ఉపాధి సిబ్బంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఇచ్చిన విందులో పాల్గొన్న విషయం మా దృష్టికి వచ్చింది. విందులో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై విచారణ చేస్తాం. యంత్రాలతో పనులు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో అలాంటి పనులు చేయరాదని హెచ్చరించాం. వీటిన్నింటిపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– ప్రసాదరెడ్డి, ఎంపీడీవో

Advertisement
 
Advertisement
Advertisement