ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన సుమారు 85 మంది రైతులు మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర ...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన సుమారు 85 మంది రైతులు మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఏపీ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మూలధన పన్ను మినహాయింపు ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
రైతుల తరఫున ఎంపీ గల్లా జయదేవ్ ప్రధానిని సత్కరించగా.. మంత్రి ప్రత్తిపాటి జ్ఞాపిక అందజేశారు. మూలధన పన్ను మినహాయింపుపై విధించిన కాలపరిమితిని ఎత్తివేయాలని రైతులు ప్రధానిని ఈ సందర్భంగా కోరారు. కాగా, కేంద్రమంత్రి సుజనాచౌదరి నివాసంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీని కూడా సన్మానించారు. ఇదిలా ఉండగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కూడా రైతులు కలసి కృతజ్ఞతలు తెలిపారు.