కర్ఫ్యూ తర్వాతా దూరం పాటించండి
అనుమానిత కేసుల్లో 130 మందికి వైరస్ సోకలేదని నిర్ధారణ
ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్రెడ్డి
సాక్షి, అమరావతి/ఒంగోలు అర్బన్: రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నిర్ధారిత కేసులు కేవలం 5 మాత్రమే నమోదయ్యాయని ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 142 మంది కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులను గుర్తించి వారి నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్లకు పంపించామని చెప్పారు. వీటిలో 130 కేసులకు నెగెటివ్ రిపోర్టు వచ్చిందని, మరో 7 మంది రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణపై శనివారం ఒంగోలులో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రి ఏమన్నారంటే..
జనతా కర్ఫ్యూకు సహకరించండి
- కరోనా నిరోధానికి ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించి ప్రభుత్వానికి సహకరించాలి.
- వైద్య, ఆరోగ్య శాఖతో ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సైతం ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా చప్పట్లు కొట్టి వారందరికీ అభినందనలు తెలపండి.
- కర్ఫ్యూ తర్వాత కూడా మనిషికీ మనిషికీ మధ్య దూరం పాటించాలి. సీఎం జగన్ ఆదేశాల మేరకు కంటి వెలుగు కార్యక్రమం వాయిదా. 50 శాతం ఉద్యోగులకు ఇంటినుంచే పని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ జవహర్రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో 50›% మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసేలా ఆదేశాలిచ్చామన్నారు.
- వైరస్ లక్షణాలున్నా లేదా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగినా ఎలా వైద్యం అందించాలన్న దానిపై మాక్డ్రిల్స్ నిర్వహిస్తున్నాం.
- ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు పెరిగితే వారికి ఎలా వైద్యం అందించాలి, అంబులెన్సులు ఎలా నడిపించాలి అనే దానిపై తగిన చర్యలు చేపట్టాం. ఉగాది రోజుల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి శ్రీశైలానికి భక్తులను రావద్దని కోరాం. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశాం.