
ఏపీ మంత్రికి చిర్రెత్తుకొచ్చింది!
‘ప్రతి నాయకుడూ వచ్చి ఉద్యోగాలు ఇప్పించాలని అడుగుతున్నారు. అందరికీ ఉద్యోగాలివ్వాలంటే ఎట్లా?
అందరికీ ఉద్యోగాలంటే ఎట్లా?: మంత్రి ఆదినారాయణరెడ్డి
సాక్షి, ఎర్రగుంట్ల : ‘ప్రతి నాయకుడూ వచ్చి ఉద్యోగాలు ఇప్పించాలని అడుగుతున్నారు. అందరికీ ఉద్యోగాలివ్వాలంటే ఎట్లా?..’ అని రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. బుధవారం సాయంత్రం వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘నాయకులు వారి స్వార్థం కోసం ఉద్యోగాలు అడుగుతున్నారు. మేం ఏమైనా ఉద్యోగాలు అమ్ముకుంటున్నామా?. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడు కూడా వారి నియోజకవర్గాల్లో అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేరు..’అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకంలో గంట కూడా పనిచేయకుండా కూలి అడుగుతుంటారని అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఉల్లి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సోమ, బుధ, శుక్రవారాల్లో కర్నూలు డివిజన్ రైతులు.. మంగళ, గురువారాల్లో ఆధోని డివిజన్ రైతులు, శనివారం నంద్యాల డివిజన్ రైతులు సరుకును మార్కెట్ యార్డుకు తీసుకురావాలని మంత్రి ఆదినారాయణ సూచించారు.