పెనుకొండ వద్ద రైట్.. రైట్.. | ACB attack RDA check post officials | Sakshi
Sakshi News home page

పెనుకొండ వద్ద రైట్.. రైట్..

Jan 24 2014 2:48 AM | Updated on Sep 2 2017 2:55 AM

ఏసీబీ వరుస దాడులతో పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టు సిబ్బంది బెంబేలెత్తిపోయారు.

 పెనుకొండ, న్యూస్‌లైన్ : ఏసీబీ వరుస దాడులతో పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టు సిబ్బంది బెంబేలెత్తిపోయారు. అనారోగ్య కారణాలు చూపుతూ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐలు) మూకుమ్మడిగా మెడికల్ లీవ్‌లో వెళ్లారు. ఇటీవలి కాలంలో నాలుగు సార్లు జరిగిన దాడుల్లో అధికారులు, సిబ్బందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
 
 ఈ నేపథ్యంలో ఎంవీఐలు వరప్రసాద్, సుబ్బరాయుడు, ప్రసాద్, క్రాంతికుమార్, నాగేంద్ర ప్రసాద్ మెడికల్ లీవ్‌పై వెళ్లిపోయారు. దీంతో రెండు రోజుల నుంచి హిందూపురం, అనంతపురం నుంచి ఇద్దరు అధికారులను డెప్యూటేషన్‌పై ఇక్కడకు పంపారు.
 
 మళ్లీ దాడులు జరుగుతాయేమోనని వారు భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఈ చెక్‌పోస్టు వద్ద లారీలు ఆపి.. డ్రైవర్లు అంతో ఇంతో సమర్పించుకోవడం పరిపాటి. ఈ నేపథ్యంలో అలవాటు ప్రకారం లారీలు ఆగగానే.. వెళ్లిపోండని సిబ్బంది సైగ చేస్తున్నారు. కాగా, ఎన్నో చెక్‌పోస్టులు ఉండగా.. ఈ చెక్‌పోస్టుపైనే పనిగట్టుకుని వరుస దాడులు జరగడంలో మర్మమేంటని సిబ్బంది గుసగుసలుపోతున్నారు..
 

Advertisement
 
Advertisement
Advertisement