
తల్లిదండ్రులు వెంకటసుబ్బారావు, జ్యోతిలతో ధనుష్ (ఫైల్) ఏడాది కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ధనుష్ సోదరుడు శ్రీకళ్యాణ్ (ఇన్సెట్లో)
సాక్షి, గుంటూరు/గుంటూరు రూరల్/గుంటూరు ఈస్ట్: గుంటూరు రూరల్ మండలం, లాలుపురం శివారు ప్రాంతంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు బీటెక్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామంలోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాధినేని ధనుష్(18), గుంటూరు కోటేశ్వరరావు(19), చిరుమామిళ్ల సాయిరాం(18), షేక్ గఫూర్(18) ప్రాణాలు కోల్పోయారు. అలోకం తారక్ హీరేంద్ర, దొప్పలపూడి సత్య కౌశిక్, ఆళ్ల శివాజీ గాయపడ్డారు.
ఈ ఏడుగురూ కలిసి సోమవారం ఉదయం కళాశాలలో అడ్వాన్స్ న్యూ ఇయర్వేడుకలు జరుపుకొన్నారు. అనంతరం షాపింగ్ కోసం విజయవాడకు కారులో బయలుదేరారు. కారు గుంటూరు వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపైకి ఎక్కి రెండు కిలోమీటర్లు వెళ్లే సరికి ముందు వెళ్తున్న మున్సిపల్ చెత్త లారీని ఓవర్టేక్ చేయబోయి వెనుక భాగంలో ఢీ కొంది. కారు నడుపుతున్న కౌశిక్ కంగారుపడి కారును కుడి వైపు తిప్పగా అప్పటికే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న వాహనం డివైడర్ ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి గాలిలోకి పల్టీలు కొట్టుకుంటూ 50 మీటర్ల దూరంలో పడింది. లారీ సైతం ఇనుప రెయిలింగ్ను ఢీకొని బోల్తాపడింది. లారీ డ్రైవర్ దేవరపల్లి కిరణ్, క్లీనర్ దూపాటి రాంచరణ్, మున్సిపల్ కార్మికుడు రుద్రయ్య గాయపడ్డారు. మృతదేహాలు, క్షతగాత్రులను జీజీహెచ్కు తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న విద్యార్థుల బంధువులు, తల్లిదండ్రులు, ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల విద్యార్థులు జీజీహెచ్కు చేరుకున్నారు. వారి రోదనలు మిన్నంటాయి.
కను పాపలను బలితీసుకున్న రోడ్డు ప్రమాదాలు
పట్నంబజారు(గుంటూరు): ఆ కుటుంబంపై కాలం కక్షగట్టిందో ఏమో.. కంటికి రెప్పలా చూసుకున్న ఇద్దరు కుమారులను రోడ్డు ప్రమాదాల రూపంలో పొట్టనబెట్టుకుంది.. సంవత్సరం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం ఆ ఇంటి పెద్ద కుమారుడిని బలితీసుకుంది. పెద్ద కుమారుడు ఆ ఇంట చేసిన సందడి ఛాయల ఆలాపనలు ఊసులాడుతూనే ఉన్న ఆ తల్లితండ్రులపై విధి మరోసారి చిన్నచూపు చూసింది.. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం మరో కంటిపాపను చిదిమేసింది.. పెద్దకుమారుడి సంవత్సరీకం జరిగి పదిహేను రోజులు గడవవముందే.. చిన్నకుమారుడి మరణవార్త విన్న ఆ తల్లితండ్రుల గుండెల పగిలిపోయాయి..
కుమారుల మృత్యువు రూపంలో పాపం ఆ తల్లితండ్రులను కన్నీటి సుడుల మధ్య నలిగిపోయేలా చేసింది. ఆర్వీఆర్ అండ్ జేసి కళాశాలలో బీటె చదువుతూ లాలుపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన వారిలో ఒకరైన సాధినేని ధనుష్ (20) కుటుంబానిది ఎనలేని విషాధ గాథ. ధనుష్ తండ్రి వెంకటసుబ్బారావు బిల్డర్.. తల్లి జ్యోతి గృహిణి. వారికి శ్రీకల్యాణ్ (24), ధనుష్ సంతానం. ప్రకాశం జిల్లా కోనంకి మండలంకు చెందిన వెంకటసుబ్బారావు విద్యానగర్లో స్థిరపడ్డారు. ఇద్దరు కుమారులను చదివించుకుంటున్న ఆ తల్లిదండ్రులను చూసి విధికి కన్నుకుట్టిందేమో... చెన్నైలో బీటెక్ నాలుగో సంవత్సరం అభ్యసిస్తున్న పెద్ద కుమారుడు శ్రీకల్యాణ్ను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. గత ఏడాది క్రితం 2017 డిసెంబర్ 16వ తేదీన కల్యాణ్ రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడు.
సరిగ్గా పదిహేను రోజుల క్రితం అతని సంవత్సరీకం జరిగింది. ఆ బాధను మరువక ముందే మరో దుర్ఘటన.. చిన్నకుమారుడు ధనుష్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని తెలిసిన బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున విద్యానగర్లోని వెంకటసుబ్బారావు ఇంటికి చేరుకున్నారు. అప్పటి వరకు ప్రమాద సమాచారం ధనుష్ తల్లి జ్యోతికి తెలియదు. ఏదో ఉపద్రవం మరోమారు తమ కుటుంబాన్ని అతలాకుతలం చేసిందని గ్రహించిన ఆ తల్లి పడ్డ వేదన ప్రతి ఒక్కరి చేత కంటనీరు పెట్టించింది. కడుపున పుట్టిన బిడ్డలు ఇక లేరని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు.
కదిలిస్తే కన్నీళ్లే
గుంటూరు ఈస్ట్: మృతిచెందిన, గాయపడిన విద్యార్థుల కుటుంబ సభ్యుల ఒక్కొక్కరిదీ ఒక్కొక్క వ్యథ. పిల్లల భవిష్యత్తు కోసం కొందరు తమ శక్తికి మించి బీటెక్ చదివిస్తున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అప్పు చేసి కష్టాలను మీద వేసుకుని జీవిత నౌకను ముందుకు లాగుతున్నారు. అయితే ఆ పిల్లలు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరారని తెలియడంతో వారి ఆశల సౌధాలు కుప్పకూలిపోయాయి. తారక్ వీరేంద్ర తండ్రి సుధాకర్ తన అన్న మృతిచెందడంతో అంత్యక్రియల కోసం ఊరు వెళ్లారు. కొడుకుకు ప్రమాదం జరిగిందని ఫోన్లో తెలుసుకుని విలవిలలాడిపోయారు. గుంటూరులో ఉన్న సమీప బంధువుకు ఫోన్చేసి జీజీహెచ్కు వెళ్లాలని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
తాను కారు డ్రైవర్ అయినా ..
పిడుగురాళ్లకు చెందిన షేక్ బాలసైదా ఎంతో ఆశపడ్డాడు. అప్పు, సొప్పు చేసి బీటెక్ చేర్పించారు. హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. అతని కుమార్తె ఫాతిమా ఆరో తరగతి చదువుతోంది. తాను ఎంతో ఆశపెట్టుకున్న గఫూర్ కానరాని లోకానికి వెళ్లిపోవడంతో బాలసైతా అచేతనుడయ్యాడు.
మేనల్లుడి పుట్టిన రోజు కోసం..
చిరుమామిళ్ల సాయిరామ్ సోదరి అమెరికాలో ఉంటారు. వారం క్రితం కంభంపాడు వచ్చారు. ఆమె కుమారుడి పుట్టిన రోజు రెండు రోజుల్లో ఉంది. ఆ వేడుకలకు హాజరు కావాలని సాయిరామ్ స్నేహితులకు సంతోషంగా చెప్పుకున్నాడు. ఇంతలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదలడంతో అతని తండ్రి రమేష్బాబు, తల్లి గంగాదేవి ఇక తాము ఎందుకు బతకాలంటూ రోదించారు.
అప్పుచేసి ఇంటికి మరమ్మతులు
గుంటూరు కోటేశ్వరరావు తండ్రి సాంబశివరావు రైతు. బీటెక్ చదివే కుమారుడి స్నేహితులు వస్తే, వారికి తగ్గట్టుగా ఇల్లు ఉండాలని ఖర్చు పెట్టి ఇంటికి మరమ్మతులు చేయించాడు. భార్య మల్లేశ్వరి అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఈ ఖర్చు ఎందుకని వారించానని తండ్రి విలపించారు.
సివిల్స్ సాధిస్తాడనుకుంటే..
పిడుగురాళ్ల/పిడుగురాళ్ల టౌన్: చదివే లోకం.. సివిల్స్లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చదువుకుంటున్న పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్ గఫూర్ (19) సోమవారం కారు ప్రమాదంలో మృతిచెందాడు. తల్లిదండ్రులు షేక్ సైదాబీ, బాలసైదాలు కన్నీరు మున్నీరయ్యారు. గఫూర్ మృతదేహం సోమవారం రాత్రి పిడుగురాళ్లలోని స్వగృహానికి రావడంతో విషాదఛాయలు అలముకున్నాయి. సివిల్స్ను గెలిచి ఉద్యోగం సాధిస్తానని, కుటుంబంతోపాటు అందరిని ఆదుకుంటానని చెప్పే గఫూర్ కానరాని లోకానికి వెళ్లాడంటూ తల్లిదండ్రులు రోదించారు. పెద్దయ్యాక మమ్మల్ని ఆదుకుంటానని చెప్పావుగా.. ఇప్పుడు కళ్ల తెరవకుండా పడుకున్నావు.. ఒక్క సారి కల్లు తెరువు బిడ్డా అంటూ చిన్నమ్మ మంగ విలపించారు.
నెరవేరని తండ్రి ఆశలు
శావల్యాపురం(వినుకొండ): గుంటూరు సమీపంలోని లాల్పురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గుంటూరు కోటేశ్వరరావు స్వగ్రామం శావల్యాపురం మండలం కొత్తలూరు పంచాయతీ శివారు తుమ్మలకుంట. అతని మృతితో తుమ్మలకుంటలో విషాదఛాయలు అలముకున్నాయి. మాజీ సర్పంచిగుంటూరు సాంబశివరావు, నాగమల్లేశ్వరి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రాథమిక విద్య నుంచి రాణిస్తున్న కుమారుడిని ఉన్నత స్థానాల్లో చూడాలని సాంబశివరావు ఖర్చును సైతం లెక్కచేయకుండా చదవిస్తున్నారు. అయితే ఆ బిడ్డను రోడ్డు ప్రమాదం పొట్టనబెట్టుకుందని తెలిసిన దంపతులు కన్నీరు మున్నీరయ్యారు.