
బాధిత కుటుంబ సభ్యులకు రూ.21 లక్షల చెక్కును అందజేస్తున్న వైఎస్సార్సీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: పూసపాటిరేగ పారిశ్రామిక వాడలో ప్రమాదవశాత్తు మరణించిన బాధిత కుటుంబానికి సదరు కంపెనీ తరఫున ఆర్ధిక సాయం సోమవారం అందజేశారు. నగరంలోని ప్రదీప్నగర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చేతుల మీదుగా కంపెనీ ప్రతినిధుల సమక్షంలో గుర్ల మండలం రాగోలు గ్రామానికి చెందిన మహంతి సంతోషిణికి రూ.21 లక్షల చెక్కును పంపిణీ చేశారు. పూసపాటిరేగ మండలం కందివలస హెచ్బిల్ కంపెనీలో గుర్ల మండలం రాగోలుకు చెందిన మహంతి వెంకటరమణ గతంలో పని చేసేవారు. ఏప్రిల్ 11న ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో ఉన్న సమయంలో చనిపోవటంతో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన మజ్జి శ్రీనివాసరావు ఆ మేరకు బాధిత కుటుంభానికి న్యాయం చేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు, గుర్ల మండలం మాజీ ఎంపీపీ శీర అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు గిడిజాల అప్పలనాయుడు, కొండపల్లి సూర్యారావు పాల్గొన్నారు.