ఇక డీఎస్పీలదే పాలన | 125 DSP's Have completed the training | Sakshi
Sakshi News home page

ఇక డీఎస్పీలదే పాలన

Nov 13 2014 2:33 AM | Updated on Aug 21 2018 9:20 PM

రాష్ట్రంలో ఇటీవల 125 మంది డీఎస్పీలు శిక్షణ పూర్తి చేసుకున్నారు.

చిత్తూరు(అర్బన్): రాష్ట్రంలో ఇటీవల 125 మంది డీఎస్పీలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారితో పాటు పదోన్నతిపై కూడా పలువురు డీఎస్పీలుగా జిల్లాకు రానున్నారు. అయితే సీఐ స్థాయి పోస్టు ఉన్న స్టేషన్లకు డీఎస్పీలను నియమించడంతో ఆ స్థానాల్లో ఇక సీఐ పోస్టులు భర్తీచేసే అవకాశాలు దాదాపు లేనట్లే. మరోవైపు ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తూ, డీఎస్పీలను నియమించడానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు 14 మంది డీఎస్పీలను కేటాయిస్తూ ఈ నెల 7న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేనివిధంగా డీసీఆర్‌బి, మహిళా పోలీసు స్టేషన్, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లకు డీఎస్పీలను నియమించారు. ఇందులో ప్రధానంగా ఎస్‌సీ, ఎస్‌టీ కేసుల దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది.
 
ఇక నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ
జిల్లాలో తిరుమల, చిత్తూరు నగరాల్లోని ట్రాఫిక్, సీసీఎస్ పోలీసు స్టేషన్లలో సీఐల స్ధానంలో డీఎస్‌డీలను నియమించారు. దీంతో నేరాలతో పాటు, ట్రాఫిక్ క్మ్రబద్ధీకరణకు మార్గం సుగుమం అయిందని భావిస్తున్నారు. చిత్తూరు సీఐను ఆపరేషన్ రెడ్‌కు కేటాయించడంతో రాత్రి గస్తీలు కూడా కరువయ్యాయి. ఆ స్థానంలోకి డీఎస్పీ రానుండడంతో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఏర్పడింది.  చిత్తూరు మహిళా స్టేషన్, తిరుపతి ఎర్రచందనం టాస్క్‌ఫోర్సుకు డీఎస్పీ పోస్టులు ఇవ్వడంపై అన్ని వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

అయిలే జిల్లాలో నేర పరిశోధన రికార్డు తయారీ (డీసీఆర్‌బీ), స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విభాగాలకు కూడా డీఎస్పీలను కేటాయించడంపై పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుండగా జిల్లాలో డీఎస్పీల నియామకం, సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు ఇచ్చే ప్రక్రియ పూర్తవడంతో అందరి చూపు సీఐలవైపే ఉంది. కోరుకున్న చోటికి పోస్టింగులు తెచ్చుకోవడానికి ఇప్పటికే జిల్లాలోని పలువురు సీఐలు అధికారపార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సీఎం సింగపూర్ పర్యటన తరువాత జిల్లాలో సీఐల బదిలీలు ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత ఎస్‌ఐల బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement