కడప సిటీ : కడప వేలాంగణి ఆరోగ్యమాత ఉత్సవాలలో పాల్గొనడం ఆ తల్లి నాకు అనుగ్రహించిన వరమని ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావు అన్నారు. కడప నగరం రైల్వేస్టేషన్ వద్దగల ఆరోగ్యమాత చర్చిలో శనివారం ఆరోగ్యమాత ఉత్సవాలు పతాక ఆవిష్కరణతో ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు ఆరోగ్యమాత పాఠశాల ఆవరణలో మరియ తల్లి మండపంలో ఉంచిన స్వరూపాన్ని ఆవిష్కరించి సమిష్టి దివ్యబలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పొలిమేర జయరావు మాట్లాడుతూ మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలని, కడపలో కొలువైన ఆమె ప్రార్థించిన వారందరిపై అనుగ్రహం చూపుతోందన్నారు. మొదటి రోజున మరియ తల్లి తేరును ప్రత్యేకంగా అలంకరించి క్షేత్రం ప్రాంగణంలో విశ్వాసులు ప్రదక్షిణలు నిర్వహించారు. ఆరోగ్యమాత సభ సిస్టర్లు పాటలు, తేరు, పీఠం అలంకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుణ్యక్షేత్రం ప్రతినిధులు రెవరెండ్ ఫాదర్ లక్కినేని ఆరోగ్యస్వామి, ఫాదర్ బి.జ్ఞాన్వేష్తోపాటు తిరునాల కమిటీ సభ్యులు, ఆరోగ్యమాత యువత, మరియదళ సభ్యులు, విన్సెంట్ డె పాల్ సభ్యులతోపాటు పెద్ద ఎత్తున విశ్వాసులు పాల్గొన్నారు.


