మైదుకూరు : పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డుకు చెందిన కమాల్ బీ(21) కనిపించడం లేదని ఆమె భర్త షేక్ ఆసిఫ్ ఫిర్యాదు చేసినట్టు శనివారం పోలీసులు తెలిపారు. జమ్మలమడుగుకు చెందిన కమాల్బీని మెకానిక్ పని చేస్తున్న ఆసిఫ్ రెండేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. శనివారం తెల్లవారుజాము నుంచి తన భార్య కనిపించడం లేదని, చుట్టుపక్కల వెతికానని, బంధువులతో కూడా మాట్లాడి వాకబు చేశానని ఆసిఫ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్య ఆచూకీ కనుగొనాలని పోలీసులను కోరాడు.
మిస్సింగ్ కేసు నమోదు
చాపాడు : మండల పరిధి మడూరు గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన మల్కి స్వాతి (35) వారం రోజులుగా కనిపించకపోవడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. వారం రోజుల క్రితం స్వాతి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో భర్త శ్రీనివాసులు తమ బంధువులు గల గ్రామాల్లో విచారణ చేసినా ఆచూకీ లభించకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రాయచోటి (చిన్నమండెం) : రాయచోటి– మదనపల్లి మార్గంలోని చిన్నమండెం మండలం వండాడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా రైల్వేకోడూరుకు చెందిన పత్తి సుధాకర్(40) మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున ఉండాలి గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న సమయంలో.. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.


