కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈనెల 24 నుంచి 27 వరకు తిరుపతిలో అమరావతి ఛాంపియన్ షిప్–2026 రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించనున్నారని డీఎస్డీఓ గౌస్బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే 12 క్రీడాంశాలలో అండర్ 17, 23 బాలబాలికలకు నియోజకవర్గ, జిల్లాస్థాయి ఎంపికలను చేపట్టామన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు పైన తెలిపిన తేదీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు.
ఈకేవైసీ చేయించుకోకుంటే గ్యాస్ కనెక్షన్ రద్దు
కడప సెవెన్ రోడ్స్ : జిల్లాలోని వంట గ్యాస్ వినియోగదారులు సకాలంలో ఈకేవైసీ చేయించుకోకపోతే ధ్రువీకరణ పూర్తయ్యే వరకు ఎల్పీజీ కనెక్షన్లు తాత్కాలికంగా నిలిపివేస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి రఘురాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్పి పే యాప్ (హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ వన్ యాప్(ఐఓసీఎల్), ఎల్లో బీ పీసీఎల్ యాప్(బీపీసీఎల్) ల ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చునన్నారు. ఈనెల 15లోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించిందని పేర్కొన్నారు. జిల్లాలో 5,28,051 గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. అందులో 4,95,036 ఈకేవైసీ పూర్తయ్యాయని తెలిపారు.
16న చెస్ టోర్నమెంట్
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 16న నగరంలోని ఇంటర్నేషనల్ డిల్లీ పబ్లిక్ స్కూల్లో అనీస్ దర్బారి చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీమతి తబస్సుం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్కు మొత్తం రూ.55 వేలు నగదు బహుమతులు ఉంటాయన్నారు. వివరాలకు 9030292116 సంప్రదించాలని కోరారు.
విద్యార్థి హక్కుల పరిరక్షణకు పోరాటం
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య
కడప వైఎస్ఆర్ సర్కిల్: విద్యార్ది హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య పేర్కొన్నారు. బుధవారం ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ పోరాటాల వేగుచుక్కగా అభివర్ణించారు. విద్యార్థుల హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, నాణ్యమైన భోజనం అందించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, సిబ్బంది కొరతను పరిష్కరించాలన్నారు.సీపీఐ నాయకులు చంద్ర, వెంకట శివ, నాగసుబ్బారెడ్డి, కెసీ బాదుల్లా, వుణుగోపాల్, మద్దిలేటి భాగ్యలక్ష్మీ పాల్గొన్నారు.
కొనసాగుతున్న
జూడాల ఆందోళన
– జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్
ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు
కడప అర్బన్: ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు ఆందోళనలను చేపట్టారు. ఇందులో భాగంగా కడపలోని జీజీహెచ్ (రిమ్స్)లో బుధవారం రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్షలను సాయంత్రం వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా కడప జీఎంసీ (రిమ్స్) జూడా అధ్యక్షుడు డాక్టర్ ఎం. రవితేజ నాయక్, ఉపాధ్యక్షులు డాక్టర్ లక్ష్మీకాంత్, కార్యదర్శి యశ్వంత్ కృష్ణ,సంయుక్త కార్యదర్శి డాక్టర్ మారుతీనాయక్, హౌస్సర్జన్ డాక్టర్ సుబ్బారెడ్డిలతో పాటు కార్యదర్శి డాక్టర్ మేఘనలతో పాటు, పీజీలు,సీనియర్ రెసిడెంట్లు, హౌస్సర్జన్లు తమ ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్టైఫండ్ను 30 శాతం పెంచాలనీ ప్రధానమైన డిమాండ్గా ఆందోళనను కొనసాగిస్తున్నామన్నారు. కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న ఉపకారవేతనాలను (స్టైఫండ్స్) వెంటనే విడుదల చేయాలన్నారు.
ప్రయాణికులకుమెరుగైన సేవలు అందిస్తాం
కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప ఆర్టీసీ జోన్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందు కు కృషి చేస్తున్నామని కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిశోర్ తెలిపారు. బుధవారం కడప బస్టాండు సమీపంలో ఉన్న ఆర్టీసీ కార్గో పాయింట్, బస్టాండులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్గో పాయింట్లలో బుకింగ్ చేసుకున్న కస్టమర్లతో ఆయన మాట్లాడారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకరావాలని ఆయన కోరారు.


