కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ సి.సుబ్రమణ్యం పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో ఉమ్మడి జిల్లాకు చెందిన డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలకు జీపీడీపీపై నిర్వహించిన ఒకరోజు వర్క్షాపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ ప్రణాళిక రచనలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, ఎస్హెచ్సీ గ్రూపులు భాగస్వాములు కావాలన్నారు. గ్రామాలకు అందుబాటులో ఉన్న ఆర్థిక, మానవ, ప్రకృతి వనరులను అంచనా వేయాలన్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక వసతుల గురించి సమీక్ష నిర్వహించాలన్నారు. తయారు చేసిన ముసాయిదా ప్రణాళికలను గ్రామ సభల్లో ఆమోదించామని చెప్పారు. జీపీడీపీ కార్యక్రమంలో ఎంపీడీఓలదే కీలకపాత్ర అని పేర్కొన్నారు.
మైలవరం జలశయానికి
కృష్ణా జలాలు విడుదల
కొండాపురం : గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జీఎన్ఎస్ఎస్ అధికారి ఉమా మహేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గండికోట ప్రాజెక్టు వద్ద ఒక గేటు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని మైలవరం ప్రాజెక్టుకు వదిలి అక్కడి నుంచి పెన్నా నదిలోకి కృష్ణా జలాలను కేసీ కెనాల్ ద్వారా కడప కార్పొరేషన్కు తాగునీటి అవసరాల కోసం 1.50 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశాల ఇవ్వడంతో 7,500 క్యూసెక్కులు విడుదల చేశామన్నారు. గండికోట ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17.7 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు చెప్పారు. మైలవరం జలాశయం నుంచి ప్రొద్దుటూరు పెన్నా పరివాహక ప్రాంతాలలో నీరు వదలడంతో భూగర్భ జలాలు పెంపొందుతాయన్నారు. నది పరివాహక గ్రామాలకు తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు.


