● కూటమి సర్కార్ వాతావరణ
బీమా నోటిఫికేషన్
● అంతా కంటితుడుపు నాటకం
● ప్రీమియం కట్టడానికి ఇచ్చింది
కేవలం నాలుగు రోజులే
కడప అగ్రికల్చర్: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పంటల బీమా పథకాలు క్షేత్రస్థాయిలో అన్నదాతలకు కన్నీళ్లే మిగులుస్తున్నాయి. జూలై 6న నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. పీఎంఎఫ్బీవై కింద ఖరీఫ్ వరి మినహా ఇతర పంటలకు జూలై 31 వరకు, వరికి ఆగస్టు 15 వరకు గడువు ఇచ్చింది. అయితే, అత్యంత కీలకమైన ‘వాతావరణ ఆధారిత పంటల బీమా’ ప్రీమియం చెల్లింపుకు మాత్రం ఈ నెల 15వ తేదీ వరకే ఆఖరి గడువుగా నిర్ణయించింది. నోటిఫికేషన్ ఆలస్యం వల్ల కేవలం నాలుగు రోజులే గడువు మిగలడంతో.. జిల్లావ్యాప్తంగా పత్తి, అరటి, వేరుశనగ, చీనీ, బత్తాయి పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హెక్టారుకు వేరుశనగకు రూ.1,400, పత్తికి రూ.5,000, అరటికి రూ.7,562.5, చీనీ, బత్తాయికి రూ.6,875 చొప్పున ఉన్న భారీ ప్రీమియాన్ని ఈ నాలుగు రోజుల్లో రైతులు ఎలా చెల్లిస్తారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. వర్షాల్లేక ఆరుతడి పంటలు మరో 15 రోజుల్లో ఎండిపోయే తరుణంలో, ఇది కేవలం కంటితుడుపు కోసం చేసిన ప్రకటన అని విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వ హడావుడి డ్రామాలకు భిన్నంగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్నదాతలకు కొండంత ‘బీమా’ ధీమా లభించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే.. రైతులపై పైసా భారం పడకుండా, వారు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్లో నమోదైతే చాలు, ఏటా ఖరీఫ్లో 12 రకాల పంటలకు, రబీలో 6 రకాల... పంటలకు పరిహారం అందజేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో (2019–20 నుంచి 2022–23 వరకు) ఉచిత పంటల బీమా కింద జిల్లావ్యాప్తంగా 3,80,475 మంది రైతన్నలకు అక్షరాలా రూ. 1,063.21 కోట్ల పరిహారాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే జమ చేశారు. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే ఈ నిధులు విడుదల కావడం వల్ల రైతులకు పెట్టుబడి ఊరట లభించేది. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీమా పథకాలను పూర్తిగా నీరుగార్చింది. 2024 ఖరీఫ్లో ఉచిత బీమా అని హంగామా చేసి పంట నష్టపోయిన రైతులకు పైసా ఇవ్వలేదు. 2025 ఖరీఫ్లో జిల్లాలో 61,986 మంది రైతులు 54,881 హెక్టార్లకు ప్రీమియం కట్టినా నేటికీ పరిహారం ఇవ్వకుండా దగా చేసింది. ఇక 2026 రబీలో అయితే ఏకంగా పంటల బీమా పథకాన్నే పూర్తిగా రద్దు చేసి అరాచకం సృష్టించింది. రైతులు, కేంద్ర ప్రభుత్వం తమ వంతు వాటా ప్రీమియం ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బకాయిలను ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టకపోవడం వల్లే పరిహారం రావడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం కంటితుడుపు నోటిఫికేషన్లు ఆపి, వాతావరణ బీమా గడువును కనీసం 15 రోజుల పాటు పొడిగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


