సింహాద్రిపురం : గిట్టుబాటు ధర లేక మండలంలోని గురజాల గ్రామంలో ఆదివారం పొలంలోనే కలింగర పంటను రైతు వదిలేశాడు. వివరాలు.. వరుణ్ రెడ్డి గురిజాలలో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని ఎకరాకు లక్ష రూపాయలతో ఐదు ఎకరాల్లో 75 రోజులకు దిగుబడి వచ్చే కలింగర పంటను సాగు చేశారు. దిగుబడి బాగా వచ్చిందని సంతోషపడ్డాడు. కేజీ తొమ్మిది రూపాయల చొప్పున 18 టన్నులు కాయలను కోశారు. కానీ రేటు పడిపోవడంతో కొనే నాథుడు లేడు. దీంతో విధి లేని పరిస్థితుల్లో పంటను వదిలేశారు. జనాలు కలింగర కాయలకు ఎగబడి కోసుకొని వెళ్లారు. ప్రజలకేమో సంతోషం.. రైతుకేమో దుఃఖం.. అప్పులు మిగిలాయి.
రెండురోజుల్లో శ్రీధర్ మృతదేహం రాక
కడప అర్బన్ : వియత్నాం బోటు ప్రమాదంలో దుర్మరణం చెందిన కడప ప్రముఖ వ్యాపారవేత్త ముడియం శ్రీధర్ (50) భౌతికకాయం మరో రెండు రోజుల్లో కడపకు చేరుకోనుంది. ఈ మేరకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు సమన్వయంతో స్వదేశానికి తరలించే అధికారిక దౌత్య ప్రక్రియలను ముమ్మరం చేశారు. ఆనందంగా గడపడానికి విదేశీ విహారయాత్రకు వెళ్లిన శ్రీధర్ ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కడప నగరాన్ని తీవ్ర శోకసముద్రంలో ముంచెత్తింది. శ్రీధర్తో పాటు అదే బోటులో ప్రయాణించి, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ కడప ఎన్జీఓ కాలనీకి చెందిన నయీమ్ సోమవారం సాయంత్రానికే కడపకు చేరుకోనున్నారు. గత 2024 నవంబర్ 14న శ్రీధర్ సోదరుడు హరి అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఆ చేదు జ్ఞాపకం నుండి తేరుకోకముందే, కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీధర్ కూడా మరణించడంతో ఆయన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తీరని లోటు మిగిలింది. కడపలో సెల్ఫోన్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి దాదాపు 50 మందికి పైగా కార్మికులకు శ్రీధర్ జీవనోపాధి కల్పించారు. కొండంత అండగా నిలిచిన యజమాని ఆకస్మిక మరణంతో ఆయా కార్మిక కుటుంబాల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. స్నేహశీలి అయిన శ్రీధర్ మృతి పట్ల కడప వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.


