ఇల్లు కట్టుకోవడానికి మనుషులు పరుగులు పెడుతుంటే.. అడవులను సృష్టించడానికి ఈ యువకుడు సైకిల్ తొక్కుతున్నాడు. దేశవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించి, గ్లోబల్ వార్మింగ్ ముప్పును తగ్గించాలనే బృహత్తర సంకల్పంతో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ముత్తు సెల్వన్ అనే యువకుడు అసాధారణ సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నాడు. ఈ ‘గ్రీన్ ఇండియా’ సైకిల్ యాత్ర సోమవారం ఎర్రగుంట్లకు చేరుకోవడంతో స్థానిక సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్ఐ నాగమురళి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముత్తు సెల్వన్ బయోటెక్నాలజీ చదివిన విద్యాధికుడు. పర్యావరణ పరిరక్షణ కోసం 2021లో ప్రారంభించిన ఈ సుదీర్ఘ సైకిల్ యాత్ర ఇప్పటివరకు పొరుగు దేశమైన నేపాల్తో పాటు భారతదేశంలోని 23 రాష్ట్రాల ద్వారా దిగ్విజయంగా సాగింది. దేశవ్యాప్తంగా మొత్తం 44,000 కిలోమీటర్ల మేర ప్రయాణించడమే లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 39,000 కిలోమీటర్ల యాత్రను విజయవంతంగా పూర్తి చేశాడు. పర్యావరణ సందేశాల బోర్డులతో కూడిన ఆయన ప్రత్యేక సైకిల్ ఏకంగా 122 కిలోల బరువు ఉంటుంది. ఇంత భారీ బరువును మోస్తూ, నిరంతరం సైకిల్ తొక్కుతూ దేశవ్యాప్తంగా 11 లక్షల మొక్కలు నాటించాలనేది ఆయన సంకల్పం. యాత్ర సాగుతున్న మార్గాల్లోని ఆయా మండలాల అధికారులు, ప్రజల సహకారంతో ఇప్పటివరకు 8.64 లక్షల మొక్కలను నాటించి పచ్చదనానికి ఊపిరి పోశాడు. 2027 నాటికి ఈ యాత్ర ఢిల్లీకి చేరుకోవడంతో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. ముత్తు సెల్వన్ చేస్తున్న సాహసయాత్ర అమో ఘమైనదని, నేటి సమాజానికి ఆదర్శనీయమని కొనియాడారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటాలని ముత్తు సెల్వన్ పిలుపునిచ్చారు. – ఎర్రగుంట్ల


