ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ సీతారాముల కల్యాణ వేదిక సమీపంలో ఆటో ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు..ఉమ్మడిగుంటపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య ఆటోలో ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకొని ఒంటిమిట్ట నుంచి భాకరాపేటకు వెళుతుండగా శ్రీ సీతారాముల కల్యాణ వేదిక వద్దకు రాగానే కోడూరులో సిమెంట్ అన్లోడ్ చేసి, తిరిగి కమలాపురానికి వెళుతున్న లారీ ఆటోను వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కృష్ణ(45)కు తలకు బలమైన గాయమైంది. కాలు విరిగింది. ప్రయాణికులు మలకాటిపల్లికి చెందిన కృష్ణయ్య(63), తప్పెటవారిపల్లికి చెందిన లక్షుమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 లో కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తుపాన్ వాహనం ఢీకొని..
పులివెందుల రూరల్ : పులివెందులలోని సెంట్రల్ బోలేవార్డులో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు..పట్టణంలోని క్రిస్టియన్లైన్ కాలనీకి చెందిన ప్రశాంత్ ఆసుపత్రికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఎదురుగా వస్తున్న తుపాన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ కాలు విరిగింది.అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు తెలిపారు.


