పోరుమామిళ్ల : మండలంలోని సిద్దవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సోమవారం పూర్వ విద్యార్థి కాకర్ల వెంకట బాలకృష్ణ రూ.1,10,000 విలువ చేసే ఆర్ఓ ప్లాంట్ అందచేశారు. సోమవారం బాలకృష్ణ, విశాలాక్షి దంపతుల చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా హెడ్మాష్టర్ గంగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో దాత బాలకృష్ణ మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని, ఇక్కడ చదువుతున్నపుడు పాఠశాలలో సదుపాయాలు, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆలోచనలు నన్ను ప్రభావితం చేశాయని, అందులో భాగంగా విద్యార్థులు శుద్ధజలం తాగేందుకు ఆర్ఓ ప్లాంట్ అందచేశానన్నారు. మరో సాఫ్ట్వేర్ ఉద్యోగి, పూర్వ విద్యార్థి ఢాకాల బాలచంద్ర మాట్లాడుతూ పదో తరగతిలో 2027లో మొదటి మూడు స్థానాల్లో మార్కులు సాధించిన విద్యార్థులకు రూ. 15 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలు నగదు బహుమతులు అందచేస్తానని తెలిపారు. ఉపాధ్యాయులు రామమోహన్రెడ్డి, బాషా మాట్లాడుతూ మేము చదివేటపుడు 7 వ తరగతి వరకే ఉండేదని, ఫ్లోరైడ్ అధికంగా ఉన్నందువల్ల తాగునీటికి ఇబ్బంది పడేవారమన్నారు. ఇప్పుడు బాలకృష్ణ ఆర్ఓ ప్లాంట్తో మంచి పని చేశారని తెలిపారు.
పూర్వ విద్యార్థి దాతృత్వంతో
విద్యార్థులకు శుద్ధజలం


