కడప అర్బన్ : స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి అడిషనల్ ఎస్.పి(అడ్మిన్) కె.ప్రకాష్బాబు పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వర రావు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
డబ్బు తీసుకొని స్థలాన్ని చూపించని వ్యక్తిపై కేసు
ప్రొద్దుటూరు క్రైం : డబ్బు తీసుకొని విక్రయించిన స్థలాన్ని చూపించని ఇరగంరెడ్డి రాజశేఖర్రెడ్డిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజశేఖర్రెడ్డి పట్టణ శివారులోని రైల్వేస్టేషన్ సమీపంలో వెంచర్ వేశాడు. అందులో 4.5 సెంట్ల స్థలాన్ని 2002లో భారతి అనే మహిళకు రూ.10 లక్షలకు విక్రయించాడు. అయితే ఆ స్థలాన్ని చూపించకపోగా డబ్బులు కూడా ఆమెకు తిరిగి ఇవ్వలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు భారతి రూరల్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఇరగంరెడ్డి రాజశేఖర్రెడ్డిపై శనివారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.
కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
ప్రొద్దుటూరు క్రైం : రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొని కడపకు చెందిన షేక్ మహబూబ్హుస్సేన్ (51) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కడపకు చెందిన మహబూబ్బాషా జిల్లాలోని దర్గాలు, మసీదులకు వెళ్తుంటాడు. అతనికి భార్యా పిల్లలెవరూ లేకపోవడంతో అన్మదమ్ముల వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఆర్టీసీ బస్సులో కడప నుంచి ప్రొద్దుటూరుకు వచ్చాడు. రాజీవ్ సర్కిల్లో రోడ్డు దాటుతున్న అతన్ని కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ భాస్కర్ తెలిపారు.
అన్న క్యాంటీన్లో మహిళ మృతి
రాయచోటి : రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అన్న క్యాంటీన్లో షేక్ ఖాసింబీ (40) అనే మహిళ మృతి చెందింది. శనివారం మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనం చేస్తున్న సమయంలోనే అక్కడే కుప్పకూలి ప్రాణం కోల్పోయింది. ఆరేళ్ల కిందట ప్రొద్దుటూరు నుంచి రాయచోటికి వచ్చిన షేక్ ఖాసింబీకి భర్త బాదుల్లా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. రాయచోటి టౌన్ మాసాపేట ఇండియన్ పెట్రోల్ బంక్ వెనుకవైపున నివాసం ఉంటూ యాచక వృత్తిలో కొనసాగుతున్నారు. రోజు వారీగా యాచక వృత్తిని ముగించుకొని శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు అన్న క్యాంటీన్ లోకి భోజనానికి వెళ్లింది. ప్లేటులో భోజనం పెట్టుకుని తింటుండగా ఆమె ఒక్కసారిగా అక్కడికి అక్కడే కుప్పకూలి పడిపోయింది.


