కడప అర్బన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని తెలిపారు. తన చాంబర్లో శనివారం ఆమె కడప న్యాయమూర్తులతో లోక్ అదాలత్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యే విధంగా కృషి చేయాలని తెలిపారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారు వారిపై ఉన్న పెండింగ్ చలానాలను ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా తమ పరిధిలో ఉన్న జాతీయ లోక్ అదాలత్ బెంచ్లలో నమోదు చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.శాంతి, 6 అదనపు జిల్లా న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి యం.శ్రీనివాసులు నాయక్, పోక్సో కోర్టు న్యాయమూర్తి యం.ఎ.సోమశేఖర్, అదనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.సి.ఆసిఫా సుల్తానా, సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫక్రుద్దీన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి పి.కోటేశ్వరరావు, మొదటి అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎం రేష్మ, రెండవ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి మదిర ఈశ్వర్ వేంకట ప్రసాద్, మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఆశాప్రియ, మూడవ అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి జి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


