– ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ధ్వజం
పులివెందుల : క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. శుక్రవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత దివంగత వైఎస్సార్, ఆయన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డిలకే దక్కుతుందన్నారు. 1996 ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వెలిగొండ ప్రాజెక్టుకు శంకు స్థాపన చేసిన చంద్రబాబు ఆ తర్వాత ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. మహానేత వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్టుకు జలయజ్ఞం పనులలో భాగంగా రూ.3,581.58కోట్లు వెచ్చించి ప్రాజెక్టుకు సంబంధించి సింహభాగం పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి మొదటి సొరంగం పనులలో మిగిలిన 2,883 కి.మీ పనులను 2021 జనవరి నాటికి పూర్తి చేశారని వివరించారు. అలాగే రెండవ సొరంగం పనులు సైతం 7,685కిలోమీటర్లు 2024 జనవరి నాటికి పూర్తయ్యాయన్నారు. అంతేకాకుండా హెడ్ రెగ్యులేటర్ పనులను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తి చేసినట్లు తెలిపారు. చంద్రబాబు తానేదో చేసినట్లుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పది రోజులు కీలకంగా భావించి క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ఫారం–7పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
న్యాయం చేయండి సారూ..
పులివెందుల పట్టణంలోని క్రిష్టియన్లైన్కు సంబంధించిన బాధితులు శుక్రవారం ఎంపీని కలిశారు. తన కుమార్తె మోక్షిత (11)కు కడుపు నొప్పి రాగా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వైద్యం వికటించి మృతి చెందిందని తండ్రి ప్రేమ్ కన్నీటిపర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. స్పందించిన ఎంపీ పోలీసులకు ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.


