కడప అర్బన్: తిరుపతి జిల్లాలో మత్స్య శాఖ అధికారిగా పనిచేస్తున్న నంద్యాల రెడ్డయ్యను తిరుపతి ఏసీబీ అధికారులు మూడు లక్షల లంచం తీసుకుంటుండగా శుక్రవారం ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఆయన నివాసం కడపలోని నాగరాజుపేటలో ఉండగా కడప ఏసీబీ సీఐ హాసం ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. రెడ్డయ్య భార్య ప్రైవేట్ వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో కడప మత్స్యశాఖ అధికారిగా కూడా ఈయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలో విధులు నిర్వహిస్తుండగా అక్కడ మూడు లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడ్డాడు. ఒకేసారి తిరుపతి,కడపలలో తనిఖీలు చేపట్టారు.


