జిల్లా ఆస్పత్రిలో ట్రాన్స్‌జెండర్‌ హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఆస్పత్రిలో ట్రాన్స్‌జెండర్‌ హల్‌చల్‌

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

డాక్టర్‌లా చైర్‌లో కూర్చొని, పేషెంట్ల నుంచి

రక్తం సేకరిస్తూ రీల్స్‌ చిత్రీకరణ

ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పతిల్రో ఓ ప్రైవేట్‌ వ్యక్తి డాక్టర్‌ కుర్చీలో కూర్చొని రీల్స్‌ చిత్రీకరిస్తూ హల్‌చల్‌ చేశాడు. రీల్స్‌ను అతనే సోషల్‌ మీడియాలో పోస్టుచేసి వైరల్‌ చేయడం చర్చనీయాంశమైంది. జిల్లా ఆస్పత్రిలోని క్యాజువాలిటీలో ఓ వ్యక్తి డ్యూటీ డాక్టర్‌ సీట్‌లో కూర్చొని రోగులను పరీక్షిస్తున్నట్లు రీల్స్‌ తీసుకున్నాడు. అంతేగాక ఆస్పత్రిలోని పేషెంట్ల నుంచి రక్తం సేకరించడం, ఆస్పత్రిలోని పలు విభాగాల్లో హల్‌చల్‌ చేస్తూ వీడియాలు తీసుకున్నాడు. ఈ వీడియాలు వైరల్‌గా మారడంతో వైద్యాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ విషయంపై జిల్లా ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆనంద్‌బాబును వివరణ కోరగా.. సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేసిన వ్యక్తితో ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అతను ఒక ట్రాన్స్‌జెండరని, అతని పేరు లక్కీ అని తెలిపారు. అతను ఆస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్‌లో ఎన్జీఓగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతను నర్సింగ్‌ విద్యార్థిగా చెప్పుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాస్తవానికి అతను నర్సింగ్‌ స్టూడెంట్‌ కాదని చెప్పారు. ఒక ప్రైవేట్‌ వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో రీల్స్‌ చిత్రీకరించిన ఘటనపై ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు భావించి ఆ సమయంలో డ్యూటీలో ఉన్న హెడ్‌ నర్స్‌, సెక్యూరిటీ సిబ్బందితో సహా 8 మందికి షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు సూపరింటెండెంట్‌ తెలిపారు. ఎవరైనా ఆస్పత్రిలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఔట్‌పోస్టు పోలీసులకు తెలిపాలని సిబ్బందికి సూచించామన్నారు.

డ్యూటీ డాక్టర్‌ కుర్చీలో కూర్చొని రీల్స్‌ తీసుకున్న లక్కీ, పేషెంట్‌ నుంచి రక్తం సేకరిస్తూ..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement