ఎస్‌ఐఆర్‌ను వేగవంతం చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ను వేగవంతం చేస్తున్నాం

Jul 3 2026 1:40 AM | Updated on Jul 3 2026 1:40 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. గురువారం విజయవాడ నుంచి ఎస్‌ఐఆర్‌ నిర్వహణ, సన్నాహక చర్యలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌.. అన్ని జిల్లాల కలెక్టర్లతో జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రొద్దుటూరు తహశీల్దార్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ హాజరవ్వగా.. కడప కలెక్టరేట్‌ బోర్డు మీటింగ్‌ హాలు నుంచి డీఆర్వో మల్లికార్జునుడు, ఎస్డీసి వెంకటపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అమలుపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 18,96,231 మంది ఓటర్లలో 14,45,697 మంది (76.24 శాతం) మ్యాపింగ్‌ పూర్తయిందని, ఇంకా 4,50,534 మంది ఓటర్ల మ్యాపింగ్‌ మిగిలి ఉందని తెలిపారు. మొత్తం 4,62,016 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు గుర్తించినట్లు వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2,251 పోలింగ్‌ కేంద్రాలను 2,444కు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

ప్రతి పేద కుటుంబానికి ఎంతో ఉపయోగం

పెండ్లిమర్రి: ఉపాధి హామీ పథకంలో కేంద్రం ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మార్పులు ప్రతి పేద కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామి పథకానికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వీబీ జీ రామ్‌ పథకాన్ని గురువారం పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామంలో ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్యరెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, ఉధ్యానశాఖ అధికారి రవిచంద్ర, ఎంపీడీవో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement