● మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
రాజుపాళెం : రాష్ట్రంలో ఆలయాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మండలంలోని వెల్లాల పుణ్యక్షేత్రంలో గురువారం శ్రీ సంజీవరాయ స్వామి మహా కుంభాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రూ.3.55 కోట్లతో నిర్మించిన ఆలయ పున నిర్మాణం, శిలాఫలకం, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పున నిర్మాణం, చుట్టూ ప్రాకారానికి వారు భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. అనంతరం చెన్నకేశవ, సంజీవరాయ స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే తెలిపిన మేరకు మరో రూ. 8 కోట్లు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ వెల్లాల పుణ్యక్షేత్రం విశిష్టత రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులకు తెలుసని అన్నారు. మంత్రికి మాజీ జెడ్పీటీసీ సభ్యులు మహేశ్వర రెడ్డి, ఆలయ చైర్మన్ లక్ష్మినారాయణ రెడ్డి, వేద పండితులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో వెంకటరామి రెడ్డి, ఏసీ శంకర్ బాలాజీ, ఈఓలు వెంకటరమణ, జగన్మోహన్ రెడ్డి, డివిజన్ ఇన్సెక్టర్కిరణ్కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తప్పిన ప్రమాదం
పులివెందుల రూరల్ : పులివెందులలోని పాత బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లింది. ముందు వెళ్తున్న కడప ఆర్టీసీ బస్సును తప్పించబోయి పక్కనే ఉన్న బైక్లపై దూసుకు రావడంతో వాహనాలు బస్సు కింద పడ్డాయి. దీంతో స్థానికులు అప్రమత్తమై బస్సు కింద పడిన ద్విచక్ర వాహనాలు తొలగించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఇలా జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపారు.
ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగివైర్ల్లు చోరీ
సుండుపల్లె : మండల పరిధిలోని పెద్దినేనికాలువ గ్రామ పంచాయతీ మాన్యంవారిపల్లెలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి రాగివైర్లను చోరీ చేశారు.బాధితుడు చిన్నపరెడ్డి ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.


