సాక్షి టాస్క్ఫోర్స్: ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనల మేరకు వ్యవహరించాల్సిన ఓ ఏఎస్ఐ అధికార తెలుగుదేశం పార్టీకి అంటకాగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న గోపవరం శ్రీనివాసులు దేవునికడప శ్రీ సోమేశ్వరస్వామి దేవస్థానం ఆలయ కమిటీలో తన భార్య గోపవరం పార్వతికి స్థానం లభించేలా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అనుకున్నట్లే ఆమెకు ఆలయ కమిటీలో చోటు దక్కడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పదవి రావడానికి సహకరించిన కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి, టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ ఆర్. శ్రీనివాసులరెడ్డిని ఘనంగా సన్మానించి కృతజ్ఞత చూపారు. ఈ క్రమంలో తాను ప్రభుత్వ ఉద్యోగినన్న సంగతి మర్చిపోయినట్లు తెలుస్తోంది. దేవునికడపలో జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నట్లు సమాచారం. ఒక ఏఎస్ఐగా అందరినీ సమదృష్టితో చూడాల్సిన ఆయన ఒక పార్టీకి కొమ్ము కాయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
దేవునికడప ఆలయ కమిటీలో తన భార్యకు స్థానం దక్కేలా చక్రం తిప్పిన వైనం


