● అక్రమంగా నిల్వ ఉంచిన 610 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
బద్వేలు అర్బన్ : బద్వేలులో ఆదివారం తెల్లవారుజామున విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మున్సిపాలిటీ పరిధిలోని రూపరాంపేట సమీపంలోని ఓ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 610 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల మేరకు శబరికుమార్ అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు రాబడిన సమాచారం మేరకు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ గోడౌన్లో అక్రమంగా రవాణాకు సిద్దంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని గుర్తించి బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకుని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. ఈ ఘటనపై శబరికుమార్ను విచారించగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని సునీల్, శివశంశకర్లకు విక్రయిస్తున్నట్లు తెలిపారన్నారు. ఈ మేరకు ముగ్గురిపై అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివశంకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ గీతాప్రసాద్రెడ్డి, విజిలెన్స్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


