కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప జిల్లా ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడిగా అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బత్తల అరుణ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయకపోవడం దుర్మార్గమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉత్సవాలు చేసుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని కార్పొరేట్ సంస్థలు ఉల్లంఘిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై జూలై 1 నుంచి 4 వరకు జరిగే రాష్ట్ర శిక్షణ తరగతుల్లో చర్చించి, భవిష్యత్ పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర సహాయ కార్యదర్శులు మల్లికార్జున రెడ్డి, అభిరామ్, చేతన్ తదితరులు పాల్గొన్నారు.


