కడప సెవెన్రోడ్స్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మల్లికార్జునుడు ఏఈఆర్ఓలకు సూచించారు. కడప కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఇటీవల ఎంపికచేసిన ఏఈఆర్ఓలకు శనివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటింటికీ వెళ్లి ఎన్మరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలీకరణ ప్రక్రియను కచ్చితంగా నిర్వహించాలని.. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు చేరకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ముసాయిదా ప్రచురణ అనంతరం వచ్చే అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఆధార్ను కేవలం గుర్తింపు పత్రంగానే పరిగణించాలని, జనన తేదీ లేదా నివాస ధ్రువీకరణకు అది ఆధారం కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు హరిప్రసాద్, రంగస్వామి మరియు ఏఈఆర్ఓలు పాల్గొన్నారు.
ప్రవక్తను కించపరిచిన వ్యక్తిపై ఎస్పీకి ఫిర్యాదు
కడప వైఎస్ఆర్ సర్కిల్: మహమ్మద్ ప్రవక్త, ఆయన సతీమణిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పశ్చిమ బెంగాల్కు చెందిన నాజియా ఇలాహి ఖాన్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్కు శనివారం కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, మయాన రహమతుల్లాఖాన్ తదితరులు ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. నాజియా ఇలాహి ఖాన్ ఇస్లాం సంప్రదాయాలు, ప్రవక్త దాంపత్య జీవితంపై తరచూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ ముస్లింల మనోభావాలను గాయపరుస్తోందని వారు ఆరోపించారు. సైబర్ చట్టాల కింద ఆమైపె కేసు నమోదు చేసి, ఈ విద్వేషాల వెనుక ఉన్న కుట్రదారులను విచారించాలని కోరారు. దీనిపై స్పందించిన ఎస్పీ షెల్కే నచ్చికేత్ విశ్వనాథ్.. న్యాయ సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో కాంగ్రెస్ నేతలు కమల్ బాషా, ఎస్. హమీద్, రఫీ ఖాన్ ఉన్నారు.


