మదనపల్లె టౌన్: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల లక్ష్యాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేరుకోవాలని, నిర్దేశిత టార్గెట్ సాధించని వారిపై చర్యలు తప్పవని ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లాల క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి భాస్కర్ హెచ్చరించారు. శనివారం స్థానిక జిల్లా ఆస్పత్రిలోని ఏఆర్టీ కేంద్రంలో కౌన్సెలర్లు, ఎన్జీవోలతో నిర్వహించిన కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మొబలైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ సురక్ష’ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. హెచ్ఐవీ స్క్రీనింగ్ లక్ష్యాన్ని 95 శాతం చేరుకోవడంతో పాటు, బాధితుల్లో 95 శాతం మందికి కచ్చితంగా చికిత్స అందించాలని ఆదేశించారు. వైరల్ లోడ్ నియంత్రణలో 99 శాతం ప్రగతి సాధించేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హుమయూన్, కౌన్సెలర్లు పురుషోత్తం, జయకుమార్ పాల్గొన్నారు.


