కడప వైఎస్ఆర్ సర్కిల్: రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ చేయాల ని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పా టు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. స్థానిక పాత రిమ్స్ లో దస్తావేజు లేఖరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రైవేటీకరణతో ఆస్తులకు భద్రత లేకుండా పోతుందన్నారు. ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ శాఖ అప్పజెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి డాక్యుమెంట్కు రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు అదనంగా ప్రైవేటు వ్యక్తులకు ప్రతి డాక్యుమెంట్కు 2వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం పెట్టుబడిదారులకు దోచిపెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పీపీపీ విధానం వల్ల రిజిస్ట్రేషన్ శాఖలో అనేక గందరగోళాలు నెలకొంటాయని దాని మూలంగా ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నాయకులు యు. సంజీవరాయుడు, కే ఓబులేసు, టి. లోకనాథం, వై.సుబ్బరాయుడు, గంగయ్య, మహేష్, శంకర్, రియాజ్, ఇక్బాల్, గణపతి, యాకోబు, రామకష్ణ, ఫైరోజ్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.


