మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీలోని శ్రీనగరం వద్ద కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామిశెట్టి రామలక్షుమ్మ (53) అనే మహిళ మృతి చెందింది. శ్రీనగరంలో హైవే పక్కనే నివాసం ఉంటున్న రామలక్షుమ్మ తమ మేకలను కొద్ది దూరంలో ఉన్న భర్త శ్రీరాములు వద్దకు చేర్చి తిరిగి ఇంటికి వస్తుండగా.. వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. సంఘటనలో తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను 108 అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేర్చారు. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించగా అక్కడ మృతి చెందింది. రామలక్షుమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా వారందరికీ వివాహాలు అయ్యాయి.
కరెంటు షాక్తో..
జమ్మలమడుగు : పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం వద్ద విద్యుత్ షాక్తో స్థానిక దిగువపట్నం కాలనీకి చెందిన పాలాజీ సురేష్ (48) శుక్రవారం మృతి చెందాడు. ప్రొద్దుటూరు రహదారిలో ఉన్న యూనియన్ బ్యాంక్తోపాటు దుకాణాల సముదాయాల కింద యూనియన్ బ్యాంక్ ఏటీఎం ఏర్పాటు చేశారు. ఏటీఎం బ్యాంక్ వద్ద పాలాజీ సురేష్ మోటార్ ఆన్ చేయడానికి స్పిచ్ నొక్కాడు. వెంటనే విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నాడని బంధువులు తెలిపారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టును ఢీకొన్న లారీ
● డ్రైవర్ సజీవ దహనం
లింగాల : బళ్లారి నుంచి నెల్లూరు గ్రానైట్ లోడుతో వెళుతున్న లారీ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగని వద్ద శుక్రవారం తెల్లవారుజామున అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీకి మంటలు అంటుకున్నాయి. లింగాల మండలం కర్ణపాపాయపల్లెకు చెందిన అలవలపాటి ఓబుళరెడ్డి (45) అనే డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుని కాలి బూడిదయ్యాడు. క్లీనర్ పుల్లయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని తీసుకరావడానికి వీల్లేకుండా బూడిద కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఓబుళరెడ్డికి భార్య రామలక్షుమ్మతోపాటు తేజశ్విని, మహేంద్ర అనే పిల్లలు ఉన్నారు.
మహిళ అదృశ్యం
వీరపునాయునిపల్లె : మండలంలోని నేలతిమ్మాయపల్లె గ్రామానికి చెందిన పఠాన్ మస్తాన్బీ(18) అదృశ్యమైనట్లు స్థానిక పోలీస్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. ఆమెకు రెండు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం పీర్ల పండుగ కోసం నేలతిమ్మాయపల్లెకు వచ్చింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లి, తిరిగి రాలేదు. సమీప ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో ఆమె తల్లి షాకీరా శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు.


