కడప అర్బన్ : కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ దగ్గర మురళి హాలుకు వెళ్లే దారిలో గుర్తుతెలియని వృద్ధుడు(60) ఈనెల 22వ తేదీన మృతి చెందాడు. అతని ఆచూకీ తెలియకపోవడంతో కడప రిమ్స్ మార్చురీలో ఉంచారు. తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని కడప వన్టౌన్ పోలీసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పొరపాటున తీసుకున్న బ్యాగ్ అప్పగింత
పోరుమామిళ్ల : బస్సులో పొరపాటున మరొకరి బ్యాగు దించుకున్నారు. కిందకు దిగాక బస్సు వెళ్లి పోయాక ఆ బ్యాగు తమది కాదని గుర్తించిన వారు తప్పు దిద్దుకోవడంతో సొంతదారుడికి చేరింది. దీనికి మాజీ కంట్రోలర్ నాగరాజు సహకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు నుంచి మైదుకూరు వస్తున్న బస్సులో దువ్వూరుకు చెందిన రమణారెడ్డి భార్యాబిడ్డలతో ఎక్కాడు. అదే బస్సులో కాశినాయన జ్యోతి క్షేత్రానికి 12 మంది బృందం ఎక్కడం జరిగింది. వారంతా ఓబుళాపురం వద్ద జ్యోతికి వెళ్లేందుకు బస్సు దిగారు. బస్సు దిగడంలో తమ బ్యాగులతోపాటు మరో బ్యాగు దింపుకొన్నారు. ఓబుళాపురం నుంచి బస్సు లేదా ఆటోలో వెళ్లాల్సి వుంది. అయితే వారు దింపుకొన్న బ్యాగులో ఒకటి తమది కాదని గుర్తించారు. వెంటనే అక్కడున్న వారితో విషయం చెప్పారు. వారు పోరుమామిళ్లలో ఉన్న మాజీ కంట్రోలర్ నాగరాజుకు సమాచారం చెప్పారు. వెంటనే నాగరాజు స్పందించి గాంధీబొమ్మ సెంటర్లో బస్సును ఆపి, బ్యాగు గురించి చెప్పగా, రమణారెడ్డి తమ బ్యాగు ఒకటి లేదని చెప్పాడు. అంత వరకు రమణారెడ్డికి తమ బ్యాగు పోయిన విషయమే తెలియదు. నాగరాజు వెంటనే రమణారెడ్డిని తన బైకుపై తీసుకొని ఓబుళాపురం వెళ్లి బ్యాగును స్వాధీనం చేసుకుని, రమణారెడ్డికి అప్పగించాడు. బ్యాగు లభించడంతో రమణారెడ్డి ఊపిరి పీల్చుకున్నాడు. నాగరాజు సమయానికి వచ్చి సమాచారం చెప్పడంతోపాటు ఓబుళాపురం తెచ్చి, బ్యాగును అప్పగించడంతో ఆనందంతో కృతజ్ఞతలు చెప్పాడు.


