కడప అర్బన్: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీషెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 247 కేసులు నమోదు చేసి, రూ. 54,354 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఆకస్మిక వాహన తనిఖీలు
కడప నగరంలో శనివారం రాత్రి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ నేతృత్వంలో వాహన తనిఖీలను నిర్వహించారు. రోడ్లపై అనవసరంగా తిరిగే వారికి పోలీస్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఊటుకూరు సర్కిల్ లో వాహన తనిఖీలను పరిశీలించి పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సూచనలు చేశారు. సరైన రికార్డులు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్కు పోలీస్ అధికారులు తరలించారు. అనంతరం కడపలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో షాపులు నిర్దేశించిన సమయానికి మూసివేశారా.. లేదా అని ఎస్పీ పరిశీలించారు. తనిఖీల్లో కడప ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామి రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ యు. సదాశివయ్య, కడప వన్ టౌన్ సీఐ వి. చిన్న పెద్దయ్య, చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి, కడప టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు, సీకే దిన్నె ఎస్.ఐ శ్రీనివాసుల రెడ్డి, చిన్న చౌకు ఎస్.ఐ రాజ రాజేశ్వర రెడ్డి పాల్గొన్నారు.


