బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రతుల ద్వారా జరగబోయేవి ముందుగానే అందులో పొందుపరచిన సంఘ సంస్కర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి నివసించిన ఇంటిని శుక్రవారం ఢిల్లీకి చెందిన ఇన్టాక్ బృందం పరిశీలించింది. 2025 నవంబర్, 11న వచ్చిన తుసానుకు స్వామి వారి మట్టి మిద్దె ఒక వైపు కూలి పోయింది. అప్పట్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, బద్వేల్ ఆర్డీఓ, పలువురు అధికారులు పరిశీలించారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా స్వామి నివాసం పునర్నిర్మిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం కదలిక వచ్చింది. కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చి పరిశీలించి, అందుకు కావాల్సిన డీపీఆర్ తయారు చేస్తున్నట్లు ఇన్టాక్ ప్రతినిధులు తెలిపారు. నిర్మాణం ఎలా చేయాలి అనే అంశంపై మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామితో చర్చించారు. పూర్తి నివేదికను కలెక్టర్కు పంపుతామని తెలిపారు. మఠం మేనేజర్ ఈశ్వరాచారి, వీరంబొట్లయ్యస్వామి, దత్తాత్రేయస్వామి, పీపీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.
కడప అర్బన్: ఈనెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి యామిని శుక్రవారం తెలిపారు. న్యాయవాదులు, కక్షిదారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జాతీయ లోక్ అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి 08562– 258622, 244622 నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.


