కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు, న్యాయవాదులు జాతీయ లోక్ అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి 08562–258622, 244622 నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వివరించారు.
కడప అగ్రికల్చర్: జిల్లాలోని వ్యవసాయ రైతు ఖాతాలకు శుక్రవారం పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా అర్హులైన 1,94.047 మంది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ. 4 వేల చొప్పున రూ. 77.22 కోట్లు, పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ. 2 వేల చొప్పున రూ. 36.08 కోట్లు రైతు ఖాతాలకు నగదు జమ అవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.
నేడు కేవీకేలో ప్రత్యక్ష ప్రసారం
కడప నగర శివార్లలోని ఊటుకూరు కృష్ణ విజ్ఞా న కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 5 గంట లకు 22వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రత్యక్ష వీక్షణా కార్యక్రమం జరుగుతుందని కేవీకే సమన్వయకర్త అంకయ్యకుమార్ తెలిపారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గురువారం టీటీడీ సీవీ అండ్ ఎస్వో మురళీకృష్ణ(ఐపీఎస్) పరిశీలించారు. ముందుగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని ఆయన దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రాన్ని, ఆలయ పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను, అలాగే కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న క్యూలైన్లు, గ్యాలరీల ఏర్పాట్లను, భక్తుల వసతి సదుపాయాలను స్థానిక పోలీసు, టీటీడీ విజిలెన్స్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా సంబంధింత అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీజీవో గిరిధర్, ఏవీఎస్వో అంజయ్య, వీఐ దండపాణి, ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.


