రెవెన్యూ క్లినిక్స్ ఫలితాలు ఇచ్చేనా?
కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలే పరిష్కారం కాక కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో కూడా భూ సంబంధ సమస్యల అర్జీలూ ఇంకా మూలుగుతూనే ఉన్నాయి.. ఇప్పుడేమో కొత్తగా ‘రెవెన్యూ క్లినిక్స్’ పేరిట కొత్త రాగం అందుకున్నారు. పేర్లు పెట్టడంపై ఉన్న శ్రద్ధ.. అర్జీల పరిష్కారంపై లేదని అర్జీదారులు మండిపడుతున్నారు. ఇక సోమవారం నుంచి పీజీఆర్ఎస్లో కొత్తగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ ఏ మేరకు ఫలితాలు ఇస్తాయన్న విషయమై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
● భూ సమస్యల్లో ప్రధానంగా కొత్త డి.పట్టా మంజూరు, డి.పట్టా భూమికి ఆన్లైన్, 1బీ మంజూరు, వెబ్ల్యాండ్లో ఉన్న సున్నా విస్తీర్ణాన్ని సవరించడం, డి.పట్టా భూమి ఆక్రమణ, తప్పుడు మ్యూటేషన్లపై ఫిర్యాదులు, ప్రభుత్వ, జిరాయితీ భూముల ఆక్రమణ, 22ఏ నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు, ఎల్టీఆర్ 1 ఆఫ్ 70, కొత్తగా అటవీ పట్టా మంజూరు, రీ సర్వే నిర్వహించాక విస్తీర్ణంలో తగ్గుదల, ఆన్లైన్ సబ్ డివిజన్ ద్వారా జాయింట్ ఎల్పీఎంలను విడదీయడం, ఆన్లైన్ సబ్ డివిజన్ ద్వారా సింగిల్ ఎల్పీఎంలను విడదీయడం, పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు తదితర సమస్యలు పీజీఆర్ఎస్కు వస్తున్నారు. వీటిని నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడి అర్జీలు అక్కడే ఉన్నాయి. బియాండ్ ఎస్ఎల్ఏ, రీ ఓపెన్ అర్జీలు అధికంగానే ఉంటున్నట్లు అదికారుల గణాంకాలు చెబుతున్నాయి. పలుమార్లు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించినా ఆశించిన ఫలితాలు రాలేదు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరోజిని నగర్ వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, సింహాద్రిపురం తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అిసిస్టెంట్లను ఇటీవల కలెక్టర్ సస్పెండ్ కూడా చేశారు. సింహాద్రిపురం డిప్యూటీ తహసీల్దార్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయ పరిధిలోని విలేజ్ సర్వేయర్లకు మెమోలు జారీ చేశారు. ఖాజీపేట ఎస్హెచ్ఓపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. అయినా కిందిస్థాయి సిబ్బందిలో మార్పు రావడం లేదు.
భూమి సమస్యల పరిష్కారం కోసమంటున్న ప్రభుత్వం
పీజీఆర్ఎస్లో పేరుకుపోయిన అర్జీలు
గతంలో ఫలితాలివ్వని రెవెన్యూ సదస్సులు


