
ఎల్లో గ్యాంగ్ హల్ చల్...
ఆపరేషన్ పులివెందుల..
ఉప ఎన్నికల్లో గెలుపు కోసంపచ్చ నేతల అరాచక ప్లానింగ్
పోలింగ్ రోజు పూర్తిగాటీడీపీ కంట్రోల్లో ఉండాలనే తపన
ఆమేరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నబీటెక్ రవి, ఎమ్మెల్యే ఆది
చోద్యం చూస్తున్న పోలీస్ శాఖ
పచ్చ సైకోలు ఊరిమీద పడ్డారు. బరిలోకి దిగి ఓటర్ల మనసులు గెలవాల్సింది పోయి అధికారదర్పాన్ని ఒళ్లంతా పూసుకుని బరితెగిస్తున్నారు. ప్రత్యర్థులపై రాళ్లూరప్పలు విసురుతున్నారు. కర్రలు..రాడ్లతో దాడులకు తెగబడుతున్నారు. పెట్రోల్ క్యాన్లు పట్టుకుని తిరుగుతూ పల్లెల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు. ఇదంతా చేసేది ఒక్క జెడ్పీటీసీ సీటు కోసమే. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న 'ముఖ్య'నేతల నుంచి ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నేతలు వీరంగం చేస్తున్నారు. 'ఆపరేషన్ పులివెందుల' అంటూ పల్లెల్ని రణరంగంగా మారుస్తున్నారు.
సాక్షి టాస్క్ఫోర్స్: జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి. ఎంత అరాచకమైనా సరే, ఎన్ని కేసులైనా పర్వాలేదు. ‘ఆపరేషన్ పులివెందుల’లో టీడీపీ జెండా ఎగరాలి.. టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన మార్గదర్శకాలివి. దీనికనుగుణంగానే క్షేత్ర స్థాయిలో చర్యలుంటున్నాయి. టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి, కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుట్రలు, కుయుక్తులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఎన్నికల రోజు పోలింగ్ ఏజెంట్లు కూడా కూర్చొకూడదనే దిశగా పథకరచన చేస్తున్నారు. ఆమేరకు వరుసగా వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ పచ్చని పల్లెల్లో ప్రత్యక్ష భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.
పులివెందులలో 30ఏళ్ల క్రితం ఇలాంటి సంస్కృతి ఉండేది. 20ఏళ్లుగా పట్టణ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. తాజా ఉప ఎన్నికలు ఒక్కమారుగా భయానక వాతావరణం తీసుకొచ్చాయి. వ్యవస్థలు చేష్టలుడిగి కూర్చుండిపోవడమే అందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మొన్న అ కారణంగా హత్యాయత్నం ఘటన ఉత్పన్నమైంది. 24 గంటలు గడవకముందే ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. ఇంత జరిగినా పోలీసులు కేసు నమోదుకు మాత్రమే పరిమితమయ్యారు. మరోవైపు నిందితులు మరికొంతమందిని టార్గెట్ చేసి కొడతామంటూ యఽథేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రచారం ఉన్న ప్రాంతాలకు మాత్రమే బందోబస్తు కేటాయిస్తున్న పోలీసు అధికారులు.. దుండగుల కట్టడికి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
చెప్పినట్లు వింటారా... మీకు అదే గతి కావాలా?!
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చెప్పినట్లు వింటారా...మీకు అలాంటి గతి పట్టించాలా?అంటూ పలువురికి ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. అంటే ఏస్థాయికి బరితెగించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దుశ్చర్యలన్నీ కూడా కేవలం పోలింగ్ రోజు ఏకపక్ష పోలింగ్ కోసమేనని పలువురు వెల్లడిస్తున్నారు. పులివెందులలో టీడీపీ బలంతో పోలిస్తే వైఎస్సార్సీపీ బలం గణనీయంగా ఉంది. అయినప్పటికీ టీడీపీ నేతలు యథేచ్ఛగా దాడులు తెరపైకి తీసుకొస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.
ఎల్లో గ్యాంగ్ హల్చల్....
వరుసగా హత్యయత్నం ఘటనలకు పాల్పడిన తెలుగుదేశం మూకలు గురువారం సైతం పులివెందులలో యథేచ్ఛగా సంచరించారు. వాహనాల్లో మారణాయుధాలు వెంటబెట్టుకొని వాహన శ్రేణితో హల్చల్ చేశారు. టార్గెట్ నిర్ణయించిన వ్యక్తుల కోసం అన్వేషించినట్లు సమాచారం. పట్టణంలోని ఓ యూట్యూబర్, మరో ఇద్దరు వేముల మండల నాయకుల కోసం విశేషంగా అన్వేషణ చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల అధికారుల కళ్ల మందే అటు ఇటు తచ్చాడుతున్నా కట్టడి చేయాలనే ఆలోచన వారికి ఏమాత్రం కన్పించలేదు. కాగా, ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏకంగా దిశా–నిర్దేశం చేస్తూ ఎల్లో గ్యాంగ్ను మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. కొంతమంది అధికారులు, తెలుగుతమ్ముళ్లు, బీజేపీ నేతలు సంయుక్తంగా అడ్డదారుల్లోనైనా సరే, పులివెందుల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలనే ఉత్సాహాన్ని అధికంగా కనబరుస్తున్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు.
త్రిముఖ వ్యూహం..
అధికారం ఉంది, ప్రతి చర్యలుండవు అనే ధీమా తెలుగుదేశం పార్టీ నేతల్లో బలంగా ఉంది. వెరసి తరచూ హత్యాయత్నం ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఈక్రమంలో ముందుగా నాయకుల్ని భయభ్రాంతులకు గురిచేయడం, తర్వాత ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచడం, ఆ తర్వాత అధికారుల ద్వారా ఏకపక్ష పోలింగ్ నిర్వహించడం. అప్పటికీ గెలుపు అంచనాకు రాకుంటే విచ్చలవిడి హింసకు పాల్పడడంతోనైనా గట్టెక్కాలనే దిశగా టీడీపీ అడుగులు వేస్తోంది. ఆమేరకు నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రణాళికలు రచించినట్లు పలువురు వెల్లడిస్తున్నారు.