
జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్రోడ్స్: వేసవిలో జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జిల్లాలో చేపడుతున్న వివిధ కాల పనుల పురోగతిపై జేసీ అదితిసింగ్తో కలిసి డ్వామా, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సీజన్లో జిల్లాలో ఎక్కడా నీటికొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెంపుడు జీవాలకు ఎలాంటి తాగునీటికొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఫారం పాండ్లు, ఇంకుడు గుంతలు, స్టార్మ్, రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల ద్వారా సమీప నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుతో మెట్ట భూములను సాగులోకి తీసుకురావాలని సూచించారు. ఎంపీడీఓలు, ఏపీఓలు వారు పనిచేసే మండలాల్లోనే నివాసం ఉంటూ ఉద్యోగ విధులను పూర్తిస్థాయిలో నిర్వర్తించాలన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 60 వేల ఎకరాల్లో ఉద్యాన మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఉద్యాన శాఖ అధికారులు, ఏపీఎంఐపీ, పీఆర్ అధికారుల సమన్వయంతో ప్లాంటేషన్ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరం ఉన్న ప్రాధాన్య పనులకు ఉపాధి కూలీలను సద్వినియోగం చేయాలన్నారు. ఉద్యాన పంటల సాగుకు పెంపొందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. డ్వామా ిపీడీ అదిశేషారెడ్డి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ఏడుకొండలు, పీఆర్ ఎస్ఈ శ్రీనివాసు లు రెడ్డి, ఉద్యాన శాఖ డీడీ సుభాషిణి, జెడ్పి సీఈఓ ఓబులమ్మ, పశుసంవర్ధక శాఖ జేడీ శారదమ్మ డ్వా మా ఏపీడీలు, ఏపీవోలు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.