
బసినికొండలో టీడీపీ బరితెగింపు
మదనపల్లె : కూటమిప్రభుత్వ పాలనలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. మదనపల్లె పట్టణశివారు ప్రాంతాల్లో ప్రధాన రహదారికి సమీపంలో కోట్ల విలువచేసే ప్రభుత్వస్థలాలు ఉండటంతో తమ్ము ళ్ల కన్ను వీటిపై పడింది. ముఖ్యంగా బసినికొండ పంచాయతీలో టీడీపీ నాయకులు బరితెగించి ప్రభుత్వస్థలాలను ఇష్టారాజ్యంగా ఆక్రమించేస్తున్నారు. ఏకంగా సచివాలయానికి కూతవేటు దూరంలో సోమవారం ఉదయం జేసీబీతో బహిరంగ మార్కెట్లో రూ.15కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించేందుకు పూనుకున్నారు. స్థానికులు గమనించి మొదట అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడకు వెళ్లి విచారిస్తే..ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరించారు. దీంతో వారు అక్కడ నుంచి వెనుదిరగడంతో స్థానికులు మీడియాకు తెలిపారు.... ఇది ప్రభుత్వగయాళు స్థలం. దీనికి సంబంధించి మీవద్ద ఏ రికార్డులు ఉన్నాయని రిపోర్టర్లు అడిగితే..తమకేమీ తెలియదని అంతా ఎమ్మెల్యేకే తెలుసు అంటూ బుకాయించారు. దీంతో మీడియా వ్యక్తులు తహసీల్దార్ ధనంజయులు, ఎమ్మెల్యే షాజహాన్బాషాకు వాట్సప్లో ఫొటోలు పంపి, సమాచారం తెలపడంతో ఆక్రమణదారులు పనులు నిలిపివేసి మెల్లగా జారుకున్నారు.
ఆరేళ్ల క్రితమే సాక్షిలో కథనం...
2019 ఫిబ్రవరిలో బసినికొండకు చెందిన టీడీపీ మైనారిటీ నాయకుడు ఎస్ఎం.రఫీ..ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బసినికొండ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్.682 గయాళుభూమిలో తప్పుడు పత్రాలతో దరఖాస్తు పట్టాలు సృష్టించి భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన సాక్షి..ఆక్రమణపై కథనం ప్రచురించడంతో ఎట్టకేలకు పనులు నిలిపివేశారు. తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అఽధికారంలోకి రావడంతో తమ ఆటలు సాగవని గుట్టుగా ఉండిపోయారు. ప్రస్తుతం మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో..ఎలాగైనా విలువైన ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించుకునేందుకు తప్పుడు పత్రాలతో తమ్ముళ్లు సిద్ధమైపోయారు. దీనిపై తహసీల్దార్ ధనంజయులు వివరణ ఇస్తూ..సమాచారం తెలిసిన వెంటనే పనులు నిలిపివేయించామన్నారు. ఆక్రమణదారులు చూపిస్తున్న దరఖాస్తు పట్టాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని తెలిపారు.
15కోట్ల విలువైన ప్రభుత్వస్థలం
ఆక్రమణకు సన్నాహాలు
పట్టపగలే జేసీబీతో చదునుపనులు
ఎమ్మెల్యే చెప్పాడంటూ
అధికారులకు బెదిరింపులు

బసినికొండలో టీడీపీ బరితెగింపు