
పుట్టాయపల్లెలో ఉద్రిక్తత
బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని పుట్టాయపల్లెలో ఆక్రమణల తొలగింపు విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఓ వర్గానికి చెందిన గ్రామస్తుల అనుభవంలో ఉన్న ప్రభుత్వ స్థలాలపై మాత్రమే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీసులు, పంచాయతీ కార్యదర్శులు ఇరువర్గాల వారితో చర్చించి ఆక్రమణల తొలగింపునకు 15 రోజులు గడువు ఇవ్వడంతో సమస్య సద్దుమనిగింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పుట్టాయపల్లెలో గల పలు సర్వే నెంబర్లలో చెరువు పోరంబోకు స్థలాలు, రస్తాలు, గ్రామకంఠాలు, కాలువలు ఆక్రమణకు గురయ్యాయని గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు ఆక్రమిత భూములు స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో గురువారం పుట్టాయపల్లె పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, రూరల్ పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించేందుకు గ్రామానికి వెళ్ళారు. ఈ సమయంలో గ్రామస్తులు గత 35 ఏళ్లుగా ఆయా సర్వే నెంబర్లలోని ప్రభుత్వ స్థలాల్లో వామిదొడ్లు, పశువుల పాకలు, ఇల్లు నిర్మించుకుని ఉన్నామని, ఇప్పుడు ఉన్నపలంగా ఓ వర్గానికి చెందిన వారి ఆక్రమణలు మాత్ర మే తొలగించాలని నిర్ణయం తీసుకోవడం సరికాదని, తమ కు కొద్ది రోజులు సమయం ఇవ్వాలని కొందరు గ్రామస్తులు అధికారులకు విన్నవించారు. అంతేకాకుండా హైకోర్టుకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకుల వర్గీయులు గ్రామంలోని పలు సర్వేనెంబర్లలో చెరువు స్థలాలు, గ్రామకంఠాలను ఆక్రమించి పంటలను సాగు చేయడంతో పాటు ఇల్లు నిర్మించుకున్నారని, వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకుపోయారు. దీంతో చేసేదేమీ లేక ఇరువర్గాల వారితో చర్చలు జరిపి 15 రోజులు గడువు ఇవ్వడంతో సమస్య సద్దుమనిగింది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులు చిన్నపోలిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దపోలిరెడ్డి, సర్పంచ్ జయరామిరెడ్డిలు జిల్లా పరిషత్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సమయం ఇచ్చేలా స్థానిక అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.