
ఘర్షణ ఘటనలో 17 మందిపై కేసు
వేంపల్లె : మండలంలోని నందిపల్లెలో జరిగిన ఘర్షణ కేసులో ఇరువర్గాలకు చెందిన 17 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. ఆదివారం రాత్రి నందిపల్లె గ్రామంలో జరిగిన భార్యాభర్తల పంచాయితీలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. దీంతో ఇరువర్గాల్లో ఉన్నవారికి గాయాలు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఐ నరసింహులు ఇరు వర్గాలకు చెందిన 17 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భర్త తరపున నందిపల్లెకు చెందిన మునవర్, అన్వర్ , మారం శ్రీకాంత్ రెడ్డితోపాటు 6మందిపై కేసు నమోదు కాగా, నేలతిమ్మయ్యగారిపల్లెకు చెందిన పెద్ద బాదుల్లా, చిన్న బాదుల్లా, అబ్దుల్లతోపాటు మరో ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
వడదెబ్బకు వృద్ధురాలి మృతి
కొండాపురం : మండల పరిధిలోని ఎస్. తిమ్మాపురం గ్రామానికి చెందిన గోసువారిపల్లె రామసుబ్బమ్మ(77) సోమవారం వడ దెబ్బతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రోజు మాదిరిగానే సోమవారం గ్రామంలో వ్యవసాయ కూలి పనికి వెళ్లింది. ఎండ తీవ్రంగా ఉండటంతో కూలి పనులు చేస్తుండగానే సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే తోటి కూలీలు కొండాపురం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.