
సజావుగా ఇసుక పంపిణీ ప్రక్రియ
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ ప్రక్రియ సజావుగా జరగాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో ఇసుక బుకింగ్, సరఫరా, ఇసుక లభ్యత వంటి అంశాలపై ఎస్పీ అశోక్ కుమార్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ లతో కలసి జిల్లా స్థాయి సాండ్ కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు. ఉచిత ఇసుక విధానంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఇసుక రీచుల వద్ద ఎంత క్వాంటిటీ బుక్ చేసుకుంటున్నారు. ఎంత నిల్వ ఉంటుంది రోజువారి డేటాను రికార్డును తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. పర్యవేక్షణ, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి వీఆర్వోలు, వీఆర్ఏ లను లేదా అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ అధికారులను పర్యవేక్షక ఇన్ఛార్జ్లుగా నియమించి ఇసుక రవాణాలో క్రమాలు జరగకుండా చూడాలన్నారు. జిల్లాలో 6 సెమి మెకనైజ్డ్ ఇసుక రీచుల నిర్వహణకు నోటిఫికేషన్ ఇవ్వాలని, అలాగే.. అదనంగా అందుబాటులో ఉన్న డిసిల్టేషన్ పా యింట్లను గుర్తించాలన్నారు. అలాగే ప్రతి స్టాక్ పాయింట్ వద్ద సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసే లా చూసుకోవాలన్నారు. అలాగే ఆర్డీవోలు తమ పరిధిలోని స్టాక్ రీచ్ లను తనిఖీ చేసి అక్కడి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నారు. జెడ్పి సీఈఓ ఓబులమ్మ, గనులు భూ గర్భ శాఖ డీడీ సూర్యచంద్రరావు, రీజినల్ ట్రాన్స్పోర్టు, పోలీస్ అధికారులు, గ్రౌండ్ వాటర్ , ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.