ఆదర్శనీయుడు వెంకటసుబ్బయ్య
బద్వేలు అర్బన్ : వైద్యునిగా, శాసనసభ్యుడిగా నిరాడంబర జీవితాన్ని గడిపిన దివంగత నేత, బద్వేలు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య నేటితరం నాయకులకు ఆదర్శమని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ పేర్కొన్నారు. దివంగత నేత డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సి.నారాయణ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తెలుగుగంగ కాలనీలోని నిరాశ్రయుల వసతి గృహంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య వైద్యునిగా, శాసనసభ్యుడిగా రాణించడంలో ఎంతో కృషి దాగి ఉందని తెలిపారు. ఆయన ఆశయసాధనకు కలిసికట్టుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. తొలుత వెంకటసుబ్బయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిరాశ్రయుల వసతిగృహం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అడా చైర్మన్ సింగసాని గురుమోహన్, పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్ డైరెక్టర్ సుందర్రామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుత్తా లక్ష్మిదేవి శ్రీరాములు, వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ కన్వీనర్ యద్దారెడ్డి, గోపవరం సచివాలయాల కన్వీనర్ పుల్లయ్య, కౌన్సిలర్లు సత్యం, మహేష్, ఆయా వార్డుల ఇన్చార్జిలు చెన్నకృష్ణారెడ్డి, మౌలాలి, సాంబశివారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.