సాక్షి, యాదాద్రి : జిల్లాలో వానాకాలానికి సంబంధించి 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. వానాకాలం 2026–27 ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో భాస్కర్రావు మాట్లాడారు. జిల్లాలో 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అక్టోబర్ నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. అదనపు టార్పాలిన్లు, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు , గ్రెయిన్ కాలిపర్స్ , తేమ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలు, డ్రయ్యర్స్ అందుబాటులో ఉండాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం నిల్వచేసేందుకు గోదాములను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, డీసీఎస్ఓ రోజారాణి , డీఎం హరికష్ణ , డీఏఓ రమణా రెడ్డి పాల్గొన్నారు.
17న ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలి
ఈనెల 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశించారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో భాస్కర్రావు మాట్లాడారు. వేడుకలకు ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ జయమ్మ, డీఆర్డీఓ నాగిరెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి అంజిరెడ్డి పాల్గొన్నారు.
ఫ ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్రావు


