రామన్నపేట: పొలం పనులు ముగించుకుని వచ్చిన రైతు ఆకస్మికంగా అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రేవనాల ఐలయ్య(46) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం భార్య, కుమారుడితో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. రాత్రి 8గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేశాడు. నిద్రకు ఉపక్రమించే సమయంలో నోటి నుంచి నురగలు వచ్చి కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స చేస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. పొలం వద్ద విషపురుగు కరిచి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడి భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు.


