మిర్యాలగూడ అర్బన్: ఉమ్మడి జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లు నిఘా నీడలోకి వెళ్లనున్నాయి. పోలీసులు, కింది స్థాయి సిబ్బంది, ఫిర్యాదుదారులు, పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొనే వారి వ్యవహార శైలిని పరిశీలించేందుకు ప్రతి పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. వీటిని డీజీపీ కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు సైతం పూర్తయింది.
వీడియోతోపాటు ఆడియో రికార్డు
నల్లగొండ జిల్లాలో 40, సూర్యాపేటలో 28, యాదాద్రి భువనగిరి జిల్లాలో 19.. మొత్తం 87 పోలీస్స్టేషన్లు ఉండగా వాటి పరిధిని బట్టి ఒక్కో పోలీస్స్టేషన్కు 11 నుంచి 13 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్లలోని ప్రతి మూలను కవర్చేసే విధంగా సీసీ కెమెరాలను అమర్చారు. ఇవి వీడియోతోపాటు, ఆడియోను కూడా రికార్డు చేస్తాయి. కెమెరాలను రాష్ట్ర స్థాయిలో డీజీపీ కార్యాలయానికి అనుసంధానం చేస్తుండటంతో నిరంతరం పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండనుంది.
ఉమ్మడి జిల్లాలోని 87 స్టేషన్లలో
సీసీ కెమెరాల ఏర్పాటు
డీజీపీ కార్యాలయానికి అనుసంధానం చేయడంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ
సిబ్బందిలో బాధ్యత పెరుగుతుంది
పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుతో స్టేషన్లకు వచ్చే బాధితులకు సేవలు పారదర్శకంగా అందే అవకాశం ఉంది. సిబ్బంది తమ విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పోలీసు సిబ్బంది వ్యవహరించే తీరులోనూ మార్పు వచ్చే అవకాశం ఉంది.
– రవి, ఇన్చార్జి డీఎస్పీ, మిర్యాలగూడ


